అమరావతి: సార్వత్రిక ఎన్నికలు ఏపీలో చాలా కీలకం కానున్నాయి. గత ఎన్నికల సమయంలో పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్.. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఆంధ్రప్రదేశ్లోని అన్ని లోక్సభ స్థానాల నుంచి జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇకపోతే జనసేన.. బీఎస్పీ, కమ్మూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే.
మరోవైపు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు జనసేన నరసాపురం ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డారు. ప్రస్తుతం ఆయన నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచారం జోరుగా చేస్తున్నారు. ఆయనతో పాటు కూతురు నిహారిక కొణిదెల కూడా ప్రచారంలో పాల్గొంది. ఇది ఇలా ఉంటే ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ కూడా జనసేన తరపున ప్రచారం చెయ్యలేదు. అయితే ఈ నెల 6 నుంచి నాగబాబు తరపున అల్లు అర్జున్, వరుణ్ తేజ్ ప్రచారం చేస్తారని తెలుస్తోంది. అంతేకాదు వీరిద్దరూ నాగబాబు తరపున ప్రచారం చేస్తారని నాగబాబు సతీమణి పద్మజ ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు. అయితే ఇది ఎంత వరకు నిజం అనేది తెలియాల్సి ఉంది.