ఆర్టీసీ సమ్మె ఉగ్రరూపం.. సర్కార్ దిగిరాకతప్పదా ?

| Edited By: Pardhasaradhi Peri

Oct 31, 2019 | 6:58 PM

ఆర్టీసీ సంస్థను  ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌తో మొదలైన సమ్మె ఇప్పుడు అస్థిత్వ పోరుగా మారుతోంది. సంస్థనే మూసేస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటనతో సమ్మె స్వరూపం మారిపోయింది. విలీనం మాట దేవుడెరుగు.. సంస్థను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నం కావడంతో కార్మిక సంఘాలు ఒక్కతాటిపైకి వచ్చాయి. సకల జనుల సమ్మె మాదిరిగా మూకుమ్మడి పోరాటాన్ని ప్రారంభించాయి. ఈ సమ్మెకు ప్రజల మద్దతు ఏ మేరకు వుందీ అన్న విషయాన్ని పక్కన పెడితే.. రాజకీయ పక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి కార్మిక సంఘాలకు […]

ఆర్టీసీ సమ్మె ఉగ్రరూపం.. సర్కార్ దిగిరాకతప్పదా ?
Follow us on
ఆర్టీసీ సంస్థను  ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌తో మొదలైన సమ్మె ఇప్పుడు అస్థిత్వ పోరుగా మారుతోంది. సంస్థనే మూసేస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటనతో సమ్మె స్వరూపం మారిపోయింది. విలీనం మాట దేవుడెరుగు.. సంస్థను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నం కావడంతో కార్మిక సంఘాలు ఒక్కతాటిపైకి వచ్చాయి. సకల జనుల సమ్మె మాదిరిగా మూకుమ్మడి పోరాటాన్ని ప్రారంభించాయి. ఈ సమ్మెకు ప్రజల మద్దతు ఏ మేరకు వుందీ అన్న విషయాన్ని పక్కన పెడితే.. రాజకీయ పక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి కార్మిక సంఘాలకు సంఘీభావం ప్రకటించాయి.
తెలంగాణ ఉద్యమ కాలంలో యావత్ భారతావని ద‌ృష్టిని ఆకర్షించిన ట్యాంక్ బండ్ మిలియన్ మార్చ్ తరహాలో ఉద్యమించేందుకు కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు సిద్దమవుతున్నాయి. దీనికి సరూర్‌నగర్ సకల జనభేరీ వేదిక నాందీ ప్రస్తావన జరిగింది. ప్రభుత్వం మొండివైఖరిని అవలంభిస్తోందంటూ ఆరోపణాస్త్రాలు సంధించిన రాజకీయ పార్టీల నేతలు.. మిలియన్ మార్చ్ నిర్వహణతో ఆర్టీసీ సమ్మెను పీక్ స్థాయికి తీసుకెళ్ళాలని వ్యూహరచన చేస్తున్నాయి. సరూర్‌నగర్ సకల జనభేరీలో పాల్గొన్న తెలంగాణ జన సమితా వ్యవస్థాపకుడు ప్రొ. కోదండరాం తొలుత మిలియన్ మార్చ్‌ నిర్వహిద్దామన్న సూచనను తెరమీదికి తెచ్చారు.
కోదండరామ్ పిలుపుకు మిగిలిన రాజకీయ పక్షాలు వెంటనే సూత్రప్రాయ అంగీకారం తెలిపాయి. కార్మిక సంఘాలు సమ్మతించాయి. ఆ తర్వాత ఈ దిశగా గురువారం కూడా చర్చలు కొనసాగినట్లు సమాచారం. హైకోర్టు కూడా ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతున్న తరుణంలో మిలియన్ మార్చ్ నిర్వహణకు పోలీసులు అనుమతించకపోయినా.. కోర్టు ద్వారా అనుమతి పొందవచ్చన్నది సమ్మెకు మద్దతిస్తున్న రాజకీయ పార్టీల అభిప్రాయంగా తెలుస్తోంది.
సంస్థనే మూసేసి, 50 వేల మంది కార్మికుల కుటుంబాలను అధోగతి పాలు చేస్తామన్న ధోరణి కరెక్టు కాదని బలంగా నమ్ముతున్న రాజకీయ పార్టీల నేతలు రేవంత్ రెడ్డి, వి.హనుమంతరావు, ఎల్.రమణ, చాడా వెంకట్ రెడ్డి, జితేందర్ రెడ్డి, ప్రొ.కోదండరామ్, ప్రజా సంఘాల నేతలు విమలక్క తదితరులు మిలియన్ మార్చ్ నిర్వహణకు సుముఖంగా వున్నట్లు సమాచారం. ఉమ్మడి ఆంధ్ర్రప్రదేశ్‌ సర్కార్ వున్నప్పుడు ట్యాంక్ బండ్ మీద మిలియన్ మార్చ్ నిర్వహిస్తే ప్రభుత్వం అనుమతించిందని.. ఇప్పుడు కెసీఆర్ సర్కార్‌ కూడా మిలియన్ మార్చ్‌కు అనుమతించాల్సిన అవసరం వస్తుందని ఈ నేతలు చెబుతున్నారు.
ఈ నేతలంతా తమ తమ పార్టీల్లో చర్చించిన తర్వాత మిలియన్ మార్చ్ నిర్వహణపై ఓ అఖిల రాజకీయ, ప్రజా సంఘాల భేటీ నిర్వహించ తలపెట్టారు. ఈ భేటీలోనే మిలియన్ మార్చ్ తేదిని, వేదికను ఖరారు చేయాలని భావిస్తున్నారు. ముందుగా తమ తమ పార్టీల్లో ఏకాభిప్రాయానికి రావడం వల్ల మిలియన్ మార్చ్ విజయవంతమై ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని, ఆ దెబ్బకు కెసీఆర్‌కు దిగిరాక తప్పని పరిస్థితి వస్తుందని కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.