ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి బ్యాంకులను మోసగిస్తున్న సంస్థ గుట్టురట్టు చేశారు సీబీఐ అధికారులు. నకిలీ పత్రాలతో రుణం పొందిన వ్యవహారంలో శ్రీ కృష్ణ అగ్రి ప్రాసెస్ ఇండియా లిమిటెడ్ సంస్థపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తోట కన్నారావు, సంచాలకులు తోట వెంకటరమణ, తోట సురేంద్రను నిందితులుగా చేర్చింది. సీబీఐ అధికారులు తెలిపిన వివరాల మేరకు.. 1999లో శ్రీ కృష్ణ ట్రేడర్స్ పేరుతో టి.కన్నారావు వ్యాపారం ప్రారంభించారు. 2008లో బ్యాంకు నుంచి రూ.5 కోట్ల మేర లోన్ గా తీసుకున్నారు. ఆ తర్వాత ఈ సంస్థను పార్టనర్షిప్ ఫర్మ్గా, అనంతరం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చారు. చివరకు శ్రీ లక్ష్మీనారాయణ ట్రేడర్స్, శ్రీ తోట కన్నారావు(హెచ్యూఎఫ్) సంస్థను విలీనం చేసి స్కపిల్ సంస్థగా మార్చారు. పౌల్ట్రీ ఫీడ్, మొక్కజొన్న, నిమ్మ విత్తనాల పొడి వ్యాపారాలను ప్రారంభించారు. ఐడీబీఐ బ్యాంకులో నకిలీ ఆడిట్ బ్యాలెన్స్ షీట్, నకిలీ స్టాక్ స్టేట్మెంట్ లాంటి ధ్రువపత్రాలను సమర్పించి సంస్థకు వర్కింగ్ క్యాపిటల్ కింద రూ.51 కోట్ల రుణం పొందారు. వ్యాపారం సరిగా నడవకపోవడంతో రుణం ఎగ్గొట్టారు. దీంతో 2017 జులై 30న ఆ సంస్థను బ్యాంకు ఎన్పీఏగా ప్రకటించింది. ఈ క్రమంలో బ్యాంకుకు రూ.51 కోట్ల రుణంతో పాటు వడ్డీ నష్టం వాటిల్లిందంటూ ఈ ఏడాది జనవరి 31న ఐడీబీఐ చాపెల్ రోడ్డు శాఖ జనరల్ మేనేజర్ మల్లికార్జున్ ఫిర్యాదు చేశారు. దీంతో అనుమానం వచ్చి బ్యాంకు ఉద్యోగుల ఫిర్యాదు మేరకు హైదరాబాద్ విభాగానికి చెందిన సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు.