తెలుగురాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాలతో విస్తారంగా వానలు పడుతున్నాయి. దాంతో వరదలు పోటెత్తుతుండడంతో.. నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రాయలసీమలో ఈసారి కుండపోత వాన పడింది.
కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు వర్షాలు ముంచెత్తాయి. కర్నూలు జిల్లా బనగానపల్లె, కోయిలకుంట్లలో ఎడతెరిపి లేకుండా పడ్డ వానలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వల్లంపాడు , లింగాల, చిన్న కొప్పెర్ల ,పెద్ద కొప్పెర్ల గ్రామాల మధ్య ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులతో రాకపోకలు నిలిచిపోయాయి.
నంద్యాల, బండి ఆత్మకూరు, మహానంది, గడివేముల మండలాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. కుందూనది పోటెత్తింది. పాలేరు, మద్దలేరు వాగులు పొంగడంతో.. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లలోని వరదనీరు చేరింది. నిత్యావసరాలు నీటి పాలు కావడంతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. రాత్రి నుంచి కునుకులేకుండా పోయిందని వాపోయారు.
ఇక భారీ వర్షాలకు వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. పసుపు, అరటి, వరి పంట దెబ్బతింది. బండిఅత్మకూరు మండలం పెద్ద దేవాలపురం గ్రామంలో విషాదం నెలకొంది. పంట నీట మునిగిపోవడంతో మనస్తాపంతో కౌలు రైతు రమేష్ పురుగుల మందుతాగి అత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది.