హైదరాబాద్ బోయిన్ పల్లిలో హాకీ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్ రావు కిడ్నాప్ కేసు తెలుగురాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఏపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియతోపాటు ఆమె భర్త భార్గవరామ్ ప్రమేయం ఉందని పోలీసులు నిర్ధారించడంతో ఈ కేసు రెండు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ అయింది. మంగళవారం అర్థరాత్రి ముఖ్యమంత్రి సమీప బంధువులైన మాజీ క్రీడాకారుడు ప్రవీణ్రావు(51), సునీల్రావు(49), నవీన్రావు (47)లను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. రాత్రి 7.30 సమయంలో ఐటీ అధికారులమంటూ ఆయన ఇంటి లోపలకు వెళ్లి.. ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవరెడ్డి పేరును ప్రస్తావించినట్టు చెబుతున్నారు. అనంతరం ముగ్గురినీ అక్కడ నుంచి బలవంతంగా తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.
బంధువుల ఫిర్యాదుమేరకు సమాచారం అందుకున్న నార్త్జోన్ డీసీపి కల్మేశ్వర్, సెంట్రల్ జోన్ డీసీపీ అక్కడికి చేరుకున్నారు. డైమండ్ పాయింట్, రాణిగంజ్ మీదుగా రెండు అనుమానిత వాహనాలు వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల ద్వారా గుర్తించి వాటిని పట్టుకున్నారు. కిడ్నాపర్ల నుంచి ప్రవీణ్ రావుతో పాటు అతని సోదరులను కాపాడారు. కాగా, హఫీజ్పేటలో ఉన్న 50 ఎకరాల భూమికి సంబంధించి ప్రవీణ్రావు కుటుంబానికి, అఖిలప్రియ కుటుంబానికి వివాదాలు నడుస్తున్నట్లుగా సమాచారం. ఆ భూమికి సంబంధించి చాలా మంది పార్ట్నర్స్ ఉన్నారని, ఆ భూమికి సుప్రీంకోర్టు క్లియరెన్స్లు అన్నీ ఉన్నాయని బాధిత బంధువులు చెప్పారు. భూమా కుటుంబం, వాళ్ల పార్ట్నర్స్ మధ్య విభేదాలు కిడ్నాప్నకు దారి తీశాయని చెబుతున్నారు.