ఈ మధ్య తన చిత్రాలతో తెలుగు వారికి మరింత చేరువైన నటి పూజాహెగ్డే.. ఓ అభిమాని తనపై చూపిన అత్యంత అభిమానానికి, ఆదరానికి ఫిదా అయిపోయారు. కేవలం తనను చూడడానికి, తనతో మాట్లాడడానికి ఎక్కడో తెలుగు రాష్ట్రం నుంచి ముంబై వచ్చి.. ఈ నగర వీధుల్లోని ఫుట్ పాత్ పై 5 రోజులుగా ఎండనక, చలి అనక పడిగాపులు పడ్డాడని తెలిసి ఆశ్ఛర్యపోయారామె.. భాస్కరరావు అనే ఆ అభిమాని ఎంతో దూరం నుంచి వచ్చి.. ఈ ‘ దుస్సాహసమే’ చేయడం ఆమెను షాక్ కి గురి చేసింది కూడా.. ఇతని వైనం తెలిసి.. చలించిపోయిన పూజాహెగ్డే. అతడ్ని కలిసి.. దయచేసి ఇలాంటి కష్టాలకు పూనుకోవద్దని, నీ ఆదరానికి ఎంతో కృతజ్ఞురాలినని చెప్పారట.. మీలాంటి అభిమానులు తమకుండడం గర్వకారణమని, అయినా ఇలా ఇన్ని రోజులు పడిగాపులు పడరాదని కోరిన ఆమె.. ఇకనైనా మీ ఇంటికి వెళ్లి మీ కుటుంబ సభ్యులను కలుసుకోమని హితవు చెప్పారు. తాను.. ‘డీజే’ మూవీ నుంచే పూజా హెగ్డే నటించిన సినిమాలను చూస్తున్నానని, అప్పటినుంచీ వీరాభిమానినయ్యానని భాస్కరరావు ఆమెకు చెప్పాడు. ఇతని అభిమానాన్ని తాను మర్చిపోలేనంటూ పూజా.. ఈ ఘటనను తన ఇన్స్టాగ్రామ్లో వీడియోతో సహా పోస్ట్ చేశారు.