
Bunny Festival : కర్నూలు జిల్లాలో ఏటా జరిగే కర్రల సమరానికి బ్రేక్ పడింది. దేవరగట్టులో ఈ ఏడాది బన్నీ ఉత్సవం నిర్వహించవద్దని అధికారులు ఆదేశించారు. సంప్రదాయమే అయినా.. కరోనా కాటేస్తున్న నేపథ్యంలో.. వేడుక పేరుతో వేల మంది ఒకదగ్గరకు చేరడం సరికాదని అధికారులు ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. మాల మల్లేశ్వరస్వామి భక్తులు సహకరించాలని వాళ్లు కోరారు.
కర్రల సమరం వద్దని అధికారులు గతంలో నచ్చజెప్పినా వేడుక మాత్రం ఆగలేదు. అదే తీవ్రతతో కొనసాగుతుంది. ఈ ఏడాది ఈనెల 21 నుంచి 30 వరకు బన్నీ ఉత్సవం నిర్వహించాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. అయితే.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. వేడుకలు రద్దు చేస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దసరా వేడుకల్లో కరోనా ప్రోటోకాల్ పాటించాలని సూచించారు.
కర్నూలు జిల్లాలోని దేవరగట్టులో ప్రతి ఏడాది దసరా రోజు రాత్రి తలలు పగులుతుంటాయి. మాల మల్లేశ్వర స్వామిని సొంతం చేసుకునే క్రమంలో.. భక్తులు కర్రలతో కొట్టుకుంటారు. తలలు పగిలినా.. ప్రాణాలమీదకు వచ్చినా.. పట్టించుకోరు. ఏటా రక్త తర్పణం జరుగుతుంటుంది.