
టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ ఆస్తులుపై ఈడీ విచారణ, స్కామ్లపై సీబీఐ విచారణ జరిపించాలంటూ సుప్రీమ్ కోర్టు చీఫ్ జస్టిస్కు వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి లేఖ రాశారు. ఫెమా, ఆర్బీఐ రెగ్యులేషన్స్, మనీ లాండరింగ్తో పాటు ఐటీ నిబంధనలను ఉల్లంఘించి అక్రమాస్తులను కూడబెట్టారంటూ ఫిర్యాదు చేశారు. రవి ప్రకాష్ హవాలా సొమ్ముతో కెన్యా,ఉగాండాలోని కంపాల సిటీ కేబుల్లో పెట్టుబడులు పెట్టారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. అంతేకాక రవిప్రకాష్ అవినీతి వ్యాపారాల జాబితాను, పలు సంస్థల్లో ఆయన పెట్టిన షేర్ల వివరాలను సైతం జత చేసి ఆధారాలతో సహా చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్కు లేఖలో రాశారు.
అంతర్జాతీయ స్థాయిలో బ్యాంకులను మోసం చేసిన మొయిన్ ఖురేషి, సీబీఐ కేసులో ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్న సానా సతీష్తో కలసి రవిప్రకాష్ చాలా మందిని మోసం చేశారని విజయసాయిరెడ్డి లేఖలో పేర్కొన్నారు. సతీష్ సానా, మొయిన్ ఖురేషి,రవిప్రకాష్ ముగ్గురు కలసి నకిలీ డాక్యుమెంట్లతో నగల వ్యాపారి సుఖేష్ గుప్తను బెదిరించి హవాలాకు పాల్పడ్డారని ఆయన లేఖలో వివరించారు.
టీవీ9లో రూ.18 కోట్ల మేరకు నిధులను దుర్వినియోగం చేసిన కేసులో రవిప్రకాష్ ప్రస్తుతం చెంచల్గూడ జైలులో ఉన్నారు. కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. కాగా, రవిప్రకాష్కు జైలు అధికారులు అండర్ ట్రయిల్ ఖైదీ నెంబర్ 4412ను కేటాయించి.. కృష్ణా బ్యారక్లో ఉంచారు.