తెలంగాణ రైతు వేదికలు దేశానికి తలమానికంగా మారనున్నాయని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇవి కేవలం రైతు వేదికలే కాదు.. తెలంగాణ రైతుల భవిష్యత్ వేదికలు, విప్లవాత్మక వేదికలు అని ఆయన చెప్పారు. రైతు రాజుగా బతకాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఈ పని చేస్తున్నారని మంత్రి వెల్లడించారు. రేపటి సభలో వీటికి సంబంధించి సీఎం కేసీఆర్ రాష్ర్ట ప్రజలకు మార్గదర్శనం చేస్తారని తెలిపారు. 2006 క్లస్టర్లు రైతు వేదికలుగా నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు. రైతు వేదికలను భవిష్యత్లోనూ మరింత ఆధునీకరించే విధంగా సీఎం నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. ఈ రైతు వేదికలు రైతులకు విజ్ఞాన భాండాగారాలుగా నిలుస్తాయన్నారు. జనగామ జిల్లాలోని కొడకండ్లలో రేపు (31తేదీన) ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు వేదికను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, కలెక్టర్ నిఖిల అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు.