రాంచీలో పండుగవేళ విషాదం… భూత వైద్యుడి మాటలు నమ్మి కొడుకు కోసం బిడ్డను చంపిన తండ్రి

|

Nov 14, 2020 | 9:11 PM

దేశం మొత్తం దీపావళి సంబురాల్లో మునిగితే, మరోవైపు మూఢవిశ్వాసంతో కన్నబిడ్డను బలి ఇచ్చాడు ఓ కసాయి తండ్రి.

రాంచీలో పండుగవేళ విషాదం... భూత వైద్యుడి మాటలు నమ్మి కొడుకు కోసం బిడ్డను చంపిన తండ్రి
Follow us on

దేశం మొత్తం దీపావళి సంబురాల్లో మునిగితే, మరోవైపు మూఢవిశ్వాసంతో కన్నబిడ్డను బలి ఇచ్చాడు ఓ కసాయి తండ్రి.. ప్రపంచం మొత్తం అభివృద్ధివైపు పరుగులు తీస్తున్నా.. కొందరు మాత్రం తమను తాము చీకట్లోనే బంధించుకుంటున్నారు.జార్ఖండ్‌లోని చాలా ప్రాంతాలు ఇంకా మంత్ర-తంత్రాల వెంటే పరుగులు తీస్తున్నారు. తాజా ఓ విషాదకర ఘటన ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది. కొడుకు పుట్టాలంటే కుమార్తెను బలివ్వాలన్న ఓ మంత్రగాడి మాయమాటలు నమ్మిన ఓ తండ్రి కన్న కూతురును పొట్టనపెట్టుకున్నాడు.

పోలీసుల కథనం ప్రకారం.. రాజధాని రాంచీలోని లోహర్డగ పెష్రార్ బ్లాక్‌కు చెందిన 26 ఏళ్ల సుమన్ నగాసియా రోజు కూలీ. అతడికి ఆరేళ్ల కుమార్తె ఉంది. ఇటీవల అతడు ఓ భూతవైద్యుడిని కలిసి తనకు మగ సంతానం కావాలంటూ వేడుకున్నాడు. అతడి వేదన విన్న భూతవైద్యుడు.. అబ్బాయి కావాలంటే ఉన్న అమ్మాయిని బలివ్వాల్సి ఉంటుందని ప్రేరేపించాడు. దీంతో అది నిజమేనని నమ్మిన సుమన్ మరో ఆలోచన లేకుండా కుమార్తె తల నరికి బలిచ్చాడు. ఈ ఘటన జరిగినప్పుడు బాలిక తల్లి ఆమె తల్లిగారింటికి వెళ్లింది. ఇదే అదునుగా ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.

ఈ దారుణానికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సుమన్‌ను అరెస్ట్ చేసి, బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. విషయం తెలుసుకున్న భూతవైద్యుడు పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.