అదృష్టం అందలం ఎక్కిస్తే, బుర్ర బురదలోకి లాక్కెళ్లినట్లుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్లు 144 సెక్షన్ విధిస్తున్నారని ఆయన ఆరోపించారు. శాంతిభద్రతలు, రైతాంగ సమస్యలపై పార్టీ మీటింగ్ లో చర్చించామన్న పవన్, అధికారంలో ఉన్న వైసీపీ ప్రజాప్రతినిధులు వాళ్ల నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని తప్పుబట్టారు. అయితే, వాళ్ల మాటలకు ఇక్కడ భయపడే వాళ్లు ఎవరూ లేరని పవన్ చెప్పుకొచ్చారు. ఫ్యూడలిస్టిక్ వ్యవస్థలో ఉన్నామా అన్న ఆయన, రోడ్లు సరిగా లేవని మా పార్టీ కార్యకర్త అంటే దాడులు చేశారు. అని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయాల్లో దాడులపై ప్రభుత్వ తీరు సరిగా లేదన్న ఆయన, ప్రభుత్వ పెద్దలు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని, ఎవరు తప్పు చేసినా ఖండించాల్సిందేనని పవన్ తెలిపారు. రామతీర్థం నిందితులను పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్న పవన్, మసీదులో, చర్చిలో ఇలాంటి దాడులు జరిగితే, ఇలా మాట్లాడగలరా అని నిలదీశారు. రామతీర్థం వచ్చి గొడవ చేయాలంటే క్షణం పట్టదన్న పవన్, ప్రభుత్వ ఉదాసీన వైఖరి అసాంఘిక శక్తులను ప్రోత్సహించేలా ఉందన్నారు. ఇలాగే పరిస్థితి ఉంటే అరాచకం రాజ్యమేలుతుందని, అచారాలను మంటగలుపుతున్నారని పవన్ విమర్శించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేసే జనసే, బీజేపీ సంయుక్త అభ్యర్ధిపై వారం రోజుల్లో ప్రకటన చేస్తామని పవన్ స్పష్టం చేశారు.