#IndiaVsAustralia2020 : టీమిండియా ఇంకా ఓల్డ్‌ స్కూల్ లోనే ఉంది : ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ సెటైర్లు

| Edited By: Pardhasaradhi Peri

Nov 28, 2020 | 4:18 PM

ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్న టీమిండియాకు పరాజయాలు తప్పవని అభిప్రాయపడ్డాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్‌ మైకేల్ వాన్‌. లిమిటెడ్‌ ఓవర్ల మ్యాచ్‌లనే కాదు, టెస్ట్‌ల్లోనూ ఇండియాకు ఓటమి తప్పదని వ్యంగ్యంగా అన్నాడు..

#IndiaVsAustralia2020 : టీమిండియా ఇంకా ఓల్డ్‌ స్కూల్ లోనే  ఉంది : ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ సెటైర్లు
Follow us on

ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్న టీమిండియాకు పరాజయాలు తప్పవని అభిప్రాయపడ్డాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్‌ మైకేల్ వాన్‌. లిమిటెడ్‌ ఓవర్ల మ్యాచ్‌లనే కాదు, టెస్ట్‌ల్లోనూ ఇండియాకు ఓటమి తప్పదని వ్యంగ్యంగా అన్నాడు.. తొలి వన్డేలో ఇండియా ఓటమి చెందడాన్ని ప్రస్తావిస్తూ మిగతా మ్యాచ్‌లలో కూడా ఇదే జరుగుతుందని అన్నాడు. ఆస్ట్రేలియాపై విజయం సాధించాలంటే మెరుగైన ఫీల్డింగ్‌, అద్భుతమైన బౌలింగ్ అవసరమని, ఈ రెండూ టీమిండియాలో లోపించాయని ఎద్దేవా చేశాడు. మరోవైపు ఆస్ట్రేలియా టీమ్‌ మాత్రం అన్ని డిపార్ట్‌మెంట్లలో చాలా స్ట్రాంగ్‌గా ఉందని ట్వీట్టర్‌లో పేర్కొన్నాడు వాన్‌. అందుకే తొలి వన్డేలో అవలీలగా విజయం సాధించగలిగిందని ట్వీట్‌ చేశాడు. మొత్తంగా ఆసీస్‌ టూర్‌లో టీమిండియాకు పరాభవాలు తప్పవని జోస్యం చెప్పాడు. ఇప్పటికీ టీమిండియా పాత పద్దతిలోనే వెళుతున్నదని, అయిదుగురు స్పెషలిస్టు బౌలర్ల గురించి ఆలోచించడం లేదని తెలిపాడు.. ఇంకా ఓల్డ్‌ స్కూల్‌లోనే ఉన్నట్టు కనిపిస్తుందని వ్యంగ్యోక్తులు విసిరాడు. అయిదుగురు స్పెషలిస్టు బౌలర్లతో ఆడితే బ్యాటింగ్‌ డిపార్ట్‌మెంట్‌ బలహీనపడుతుందన్న విషయాన్ని కోహ్లీ సేన తెలుసుకుంటే మంచిదని సూచించాడు. నిన్న సిడ్నీలో జరిగిన తొలి వన్డేలో ఇండియా బ్యాటింగ్‌లో ఓ మోస్తరుగా రాణించినా బౌలింగ్‌, ఫీల్డింగ్‌లలో తేలిపోయింది.. అందుకే 66 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది.