రెండో దశ ఎన్నికలకు సంబంధించి… తమిళనాడు, కర్ణాటకలో ప్రచారం ముగిసేలోపే… ఐటీ అధికారులు దాడులతో విరుచుకుపడ్డారు. ప్రధానంగా ఎన్డీయే కూటమికి సవాల్ విసురుతున్న DMK, JDS పార్టీల నేతలు, వాళ్ల బంధువులు, సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేశారు. తూత్తుకుడి లోక్సభ నియోజకవర్గం డీఎంకే అభ్యర్థి కనిమొళి నివాసం, కార్యాలయంలో మంగళవారం రాత్రి ఆదాయపు పన్ను శాఖ అధికారులు మెరుపు సోదాలు నిర్వహించారు. తూత్తుకుడిలోని కురింజి నగర్లో ఆమె నివసిస్తున్న ఇల్లు, కార్యాలయంలో మంగళవారం రాత్రి ఐటీ విభాగానికి చెందిన పదిమంది సభ్యుల బృందం సోదాల్లో పాల్గొంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లకు నగదు పంచిపెడుతున్నట్టు ఇప్పటికే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ సోదాలు జరిగాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే డీఎంకే కోశాధికారి దురైమురుగన్, ఆయన కుమారుడు వేలూరు అభ్యర్థి కదిర్ ఆనంద్, డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్, ఎమ్మెల్యే హాస్టల్లోని మంత్రులు ఆర్బీ ఉదయకుమార్, ఉడుమలై రాధాకృష్ణన్ల గదుల్లో ఐటీ సోదాలు చోటుచేసుకున్నాయి. డీఎంకేను లక్ష్యంగా చేసుకుని ఈ సోదాలు జరుగుతున్నాయని, నెల రోజులుగా మూసి ఉన్న రాష్ట్రమంత్రుల గదుల్లో కంటితుడుపు కోసమే సోదాలు జరిగాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి.