
న్యూఢిల్లీ : ఇప్పుడు నగదు బదిలీకి పలు యాప్లు అందుబాటులో వున్నాయి. దీంతో నగదు బదిలీ క్షణాల్లో జరిగిపోతోంది. ఈ నగదు బదిలీ యాప్లలో ఎక్కువ శాతం మంది “గూగుల్ పే” ను ఉపయోగిస్తున్నారు. అయితే ఈ యాప్ను రిజర్వ్ బ్యాంక్ ధ్రువీకరించలేదంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో “గూగుల్ పే” అధికారికమేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. “గూగుల్ పే” యాప్పై అభిజిత్ మిశ్రా అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ యాప్ పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ చట్టాన్ని ఉల్లంఘించిందని, నగదు బదిలీలు చేసేందుకు ఈ యాప్కు ఆర్బీఐ నుంచి సరైన ధ్రువీకరణ లేదని మిశ్రా పిటిషన్లో పేర్కొన్నారు. అంతేగాక.. ఈ ఏడాది మార్చి 20న ఆర్బీఐ విడుదల చేసిన అధికారిక పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్స్ జాబితాలో “గూగుల్ పే” పేరు లేదని వెల్లడించారు.
మిశ్రా పిటిషన్పై దర్యాప్తు చేపట్టిన న్యాయస్థానం.. అధికారిక ధ్రువీకరణ లేకుండానే “గూగుల్ పే” యాప్ కార్యకలాపాలను ఎలా సాగిస్తోందని ఆర్బీఐని ప్రశ్నించింది. ఈ పిటిషన్పై తమ స్పందన తెలియజేయాలని ఆర్బీఐ, గూగుల్ ఇండియాలకు నోటీసులు జారీ చేసింది.