
కేరళ అళపుజలోని ఓ మసీదు…. హిందూ జంట పెళ్లితో కళకళలాడింది. వంద సంవత్సరాల చరిత్ర గల చెరావల్లి జమాత్ మసీదు అది ! ఇక్కడ ఆదివారం జరిగిన ఈ వివాహానికి అన్ని మతాలకు చెందిన సుమారు వెయ్యి మందికిపైగా హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. వరుడు శరత్, వధువు అంజు మెడలో తాళి కడుతుండగా.. కళ్యాణ బాజాలతో ఆ మసీదు హోరెత్తింది. పురోహితుని మంత్రాల మధ్య ఘనంగా జరిగిన ఈ వివాహం అనంతరం కొత్త జంట ఇమామ్ చీఫ్ రియాసుద్దీన్ ఫైజీ ఆశీస్సులు తీసుకున్నారు. తాము పేద కుటుంబానికి చెందినవారమని, తన కుమార్తె అంజు పెళ్లి చేసే తాహతు తనకు లేదని, మసీదు కమిటీయే ఇందుకు చొరవ తీసుకోవాలని వధువు తల్లి మొర పెట్టుకోవడంతో మసీదు అధికారులు ఇందుకు అంగీకరించి ఈ హిందూ జంట పెళ్లి జరిపించారు. కేరళలో అన్ని మతాల సమైక్యతకు ఇది నిదర్శనమని సీఎం పినరయి విజయన్ అంటూ నూతన వధూవరులకు, మసీదు కమిటీకి , చెరావల్లి స్థానికులకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. పెళ్లి కానుకగా వధువుకు ముస్లిం జమాత్ కమిటీ…. పది సవర్ల బంగారాన్ని, రెండు లక్షల నగదును, గృహోపకరణాలను అందజేసింది.