నిజామాబాద్ జిల్లాలో కరోనా కలకలం రేపోతోంది. జిల్లా కేంద్రంలో తొలి పాజిటివ్ కేసు నమోదయ్యింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నిజామాబాద్ పట్టణంలోని ఖిల్లా రోడ్డులోని ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. 60 ఏళ్ల ఆయన ఈ నెల 12న ఢిల్లీ నుంచి తిరిగొచ్చారు. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన్ను ఈ నెల 15న హాస్పిటల్లో చేర్పించారు. వైద్య పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో నిజామాబాద్లో హై అలర్ట్ ప్రకటించారు. అత్యవసరం అయితేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులతోపాటు కాంటాక్ట్ అయిన పది మందిని క్వారంటైన్కు తరలించారు. ఈ నెల 12-15 తేదీల మధ్య ఆయన ఇంకా ఎవరినైనా కలిశారా? ఏదైనా హాస్పిటల్కు వెళ్లారా అనే దిశగా అధికారులు ఆరా తీస్తున్నారు.జిల్లాలో 13 మంది అనుమానితుల శాంపిళ్లను పరీక్షలకు పంపగా.. 12 మందికి నెగటివ్ అని రిపోర్ట్ వచ్చింది.