కాశ్మీర్ పై కేంద్రం ప్రజలను ఎందుకలా భయపెడుతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ప్రశ్నించారు. అమర్ నాథ్ యాత్రికులు, టూరిస్టులు, తక్షణమే ఈ రాష్ట్రాన్ని విడిచి వెళ్లాలని కేంద్ర హోం శాఖ ఎందుకు హఠాత్తుగా హెచ్ఛరించిందని ఆయన అన్నారు. శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ అలర్ట్ ప్రకటనతో ప్రజలు, యాత్రికులు, టూరిస్టులు భయపడిపోయారని, తీవ్ర ఆందోళన చెందారని అన్నారు. ఈ ప్రకటన ద్వారా ప్రభుత్వం ఓ భయానక, ద్వేష పూరిత వాతావరణాన్ని సృష్టించిందని ఆజాద్ విమర్శించారు. బయటివారికి, విదేశీ పర్యాటకులకు ఈ రాష్ట్రంలో భద్రత లేదని, ఇది ‘ అన్ సేఫ్ ‘ అని మనకు మనమే చెప్పుకున్నట్టు అయిందని దుయ్యబట్టారు. ప్రభుత్వ వైఖరిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.
శుక్రవారం ప్రభుత్వం చేసిన హెచ్ఛరికతో అనేకమంది యాత్రికులు, టూరిస్టులు శ్రీనగర్ విమానాశ్రయం వద్ద క్యూలు కట్టగా.. స్థానికులు పెట్రోలు బంకుల వద్ద, ఏటీఎంల వద్ద బారులు తీరారు. ఎయిర్ పోర్టులో విమానాలు ఎక్కేందుకు అక్కడికి చేరుకున్న పలువురికి టికెట్లు లభించక అల్లల్లాడారు. అయితే శనివారం సాయంత్రానికి ఈ ‘ పరిస్థితి కొంతవరకు చల్లబడింది ‘. కాగా-కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తికి సంబంధించి రాజ్యాంగపరమైన ఎలాంటి మార్పుల గురించి ప్రభుత్వానికి తెలియదని, పైగా ఇతర సమస్యలతో సెక్యూరిటీ వ్యవహారాలను లింక్ పెట్టి భయాందోళన సృష్టించవద్దని, వదంతులను నమ్మరాదని గవర్నర్ సత్య పాల్ మాలిక్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.