ఏపీ డీఎస్సీ-2018 అభ్యర్థులకు శుభవార్త.. నియామకాల తేదీ ఖరారు

|

Sep 22, 2020 | 6:00 PM

రెండేళ్ళ క్రితం ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ రాసిన నియమకాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. వివిధ కారణాలతో, పలు కేసులతో వాయిదా పడుతూ వస్తున్న ఉపాధ్యాయ నియామకాల ఉత్తర్వులను...

ఏపీ డీఎస్సీ-2018 అభ్యర్థులకు శుభవార్త.. నియామకాల తేదీ ఖరారు
Follow us on

రెండేళ్ళ క్రితం ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ రాసిన నియమకాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. వివిధ కారణాలతో, పలు కేసులతో వాయిదా పడుతూ వస్తున్న ఉపాధ్యాయ నియామకాల ఉత్తర్వులను ఇచ్చేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు ఏపీ విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్ మంగళవారం వెల్లడించారు.

డీఎస్సీ 2018కి సంబంధించి కోర్టుల్లో వివాదం వల్ల చాలా పోస్టులను భర్తీ చేయలేదని తెలిపిన మంత్రి..హైకోర్టు తీర్పు వెలువడిన దరిమిలా అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 3,524 ఉపాధ్యాయ పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే 2,203 మంది అభ్యర్థుల వెరిఫికేషన్ పూర్తి అయ్యిందని, మిగిలిన 1,321 మంది అభ్యర్థుల వెరిఫికేషన్ మంగళవారం సాయంత్రానికి పూర్తి చేశామని ఆయన వివరించారు.

సెప్టెంబర్ 24వ తేదీన ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తామని, ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల వివరాలను కూడా అదే రోజున అభ్యర్థులకు తెలియజేస్తామని మంత్రి తెలిపారు. అభ్యర్థులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్న మంత్రి.. సెప్టెంబర్ 25, 26 తేదీల్లో కౌన్సిలింగ్ నిర్వహించి.. అదే రోజుల్లో అపాయింట్‌మెంటు ఆర్డర్లను అందిస్తామన్నారు.

ఎస్జీటీ పోస్టులు భర్తీ అయ్యాక న్యాయస్థానం ఆదేశాల ప్రకారం మిగిలిన పోస్టులు భర్తీ చేస్తామని, ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్, వ్యాయామ ఉపాధ్యాయులు, ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామని మంత్రి సురేశ్ తెలిపారు. సెప్టెంబర్ 28లోపు నియామక ప్రక్రియను పూర్తి చేసి అర్హులకు నియామక పత్రాలు అందిస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న వాటిని పూర్తి చేశాక డీఎస్సీ 2020 నిర్వహిస్తామని ఆయనన్నారు. టెట్ పరీక్ష విధి విధానాలు రూపొందించామని, టెట్ సిలబస్‌ను ఆధునీకరించి పరీక్షను నిర్వహిస్తామని మంత్రి వివరించారు.

పేరెంట్స్ అనుతితోనే పాఠశాలలకు విద్యార్థులు

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలతోనే రాష్ట్రంలో పాఠశాలలు తెరిచామని, 9, 10 తరగతుల విద్యార్థులు తల్లిదండ్రుల అనుమతితో పాఠశాలకు రావచ్చని తెలిపిన మంత్రి.. అనుమానాలు నివృత్తి చేసుకునేందుకే పాఠశాలలు తెరిచామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు, విధి విధానాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. విద్యా కానుక కిట్లు అన్ని పాఠశాలలకు చేరాయని, సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల అనంతరం విద్యార్థులకు అందజేస్తామని తెలిపారు. రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు సంబంధించి రేషనలైజేసన్ సహా అవసరమైన ప్రక్రియ దాదాపు పూర్తైందని, రెండు, మూడు రోజుల్లో టీచర్ల బదిలీలపై నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి సురేశ్ వివరించారు.