Ghmc election result 2020 : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజేత ఎవరో తేలేది రేపే.. అప్రమత్తంగా ఉండేవాళ్లనే ఏజెంట్లుగా ఎంపిక చేయాలన్న కేటీఆర్‌

| Edited By: Ram Naramaneni

Dec 03, 2020 | 10:30 AM

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజేత ఎవరనేది రేపే తేలిపోబోతోంది. మొత్తం 150 వార్డుల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది...

Ghmc election result 2020 : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజేత ఎవరో తేలేది రేపే.. అప్రమత్తంగా ఉండేవాళ్లనే ఏజెంట్లుగా ఎంపిక చేయాలన్న కేటీఆర్‌
Follow us on

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజేత ఎవరనేది రేపే తేలిపోబోతోంది. మొత్తం 150 వార్డుల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. నిబంధనల ప్రకారం ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌లను లెక్కిస్తారు. మొత్తం 30 కేంద్రాల్లో డివిజన్‌కు ఒకటి చొప్పున, 16 వార్డులకు మాత్రం రెండు చొప్పున మొత్తం 166 హాళ్లలో ఓట్లను లెక్కించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి హాల్‌లో 14 టేబుల్స్‌పై ఒక రిటర్నింగ్‌, సహాయ రిటర్నింగ్‌ అధికారులు కౌంటింగ్‌ను పర్యవేక్షిస్తారు. ప్రతి కౌంటింగ్‌ టేబుల్‌కు ఒకరి చొప్పున ఆయా పార్టీల అభ్యర్థులు తమ ఏజెంట్లను నియమించుకునే వెసులుబాటు ఉంది. అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే డ్రా పద్ధతిలో విజేతలను ప్రకటిస్తారు.

రీ కౌంటింగ్‌ చేయించాలనుకునే అభ్యర్థులు ఫలితాలు ప్రకటించకముందే ఆర్వోకు దరఖాస్తు చేయాలి. ఇలా ఉండగా, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు బాగా కష్టపడ్డారని, ఇదే స్ఫూర్తిని కౌంటింగ్‌లోనూ ప్రదర్శించాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ పార్టీ నేతలకు సూచించారు. శుక్రవారం ఓట్ల లెక్కింపు నేపథ్యంలో పార్టీ ముఖ్యనేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు జరిగిన నేపథ్యంలో కౌంటింగ్‌లో పాల్గొనే ఏజెంట్లు చురుకైనవారు ఉండేలా చూడాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు కేటీఆర్.