అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం విశ్వహిందూ పరిషద్ కార్యకర్తలు గుజరాత్ లోని కచ్ జిల్లాలో విరాళాలు సేకరిస్తూ ఉత్సాహం పట్టలేక ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా జైశ్రీరామ్ అని నినాదాలు చేస్తూ రాముడి బ్యానర్లు, కటౌట్లతో లౌడ్ స్పీకర్ లో పాటలతో హోరెత్తించారు. ఇందుకు మరోవర్గం అభ్యంతరం చెబుతూ కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణలు రేగాయి. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేసి బాష్పవాయువు ప్రయోగించారు. సుమారు 40 మందిని అరెస్టు చేశారు. ఈ అల్లర్లలో ఓ పోలీసుతో సహా కొంతమంది గాయపడ్డారు. ఒక చోట ఒకరి మృతదేహాన్ని కనుగొన్నామని పోలీసులు తెలిపారు. మళ్ళీ అల్లర్లు రేగకుండా 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించారు. అయోధ్యలో ఆలయ నిర్మాణానికి విరాళాలు సేకరిస్తుండగా ఇంత పెద్ద ఎత్తున హింస చెలరేగడం ఇదే మొదటిసారి.