
Famous 10 Rupees Meal Ramu Thatha Passed Away : రూ.10కి భోజనం పెట్టిన రాము తాత కన్నుమూశారు. చెన్నై టీ నగర్లో 50 సంవత్సరాలుగా రాము తాత హోటల్ నిర్వహిస్తున్నారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్న సమయంలో కూడా తన హోటల్లో ధరను పెంచలేదు.
ప్రజలకు ఏదో ఒకవిధంగా సేవ చేయాలని భావించిన రాము తాత. 1967 లో ఈ హోటల్ను ప్రారంభించారు. ప్రారంభం నుంచే ఆయన రూపాయి, రూ.2లకే భోజనం పెట్టేవారు. ఇటీవల కాలంలోనే ఆ ధరను రూ.10కి పెంచారు. కొందరు భోజనం చేశాక తోచినంత సాయం అందించేవారు. వారితోపాటు స్నేహితులు, స్వచ్ఛంద సంస్థలు అందించిన సహకారంతో ఇంతకాలం ఈ హోటల్ను నిర్వహించారు.
ఎన్నడు కూడా లాభాల కోసం హోటల్ను నిర్వహించని రాము తాత అంటే అక్కడివారికి చాలా అభిమానం. డబ్బులు ఇవ్వలేనివారికి కూడా రుచికరమైన భోజనంను అందించేవారని స్థానికులు గుర్తు చేసుకున్నారు. కుటుంబ ఖర్చులకు లేకపోయినా హోటల్ నిర్వహణను మాత్రం మానుకోలేదని టీ నగర్ వాసులు అంటున్నారు.