విశాఖ ఏజేన్సీలో పడిపోయిన ఉష్ణోగ్రతలు… 4 రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు

|

Jan 11, 2021 | 6:15 AM

విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పడిపోతున్నాయి.

విశాఖ ఏజేన్సీలో పడిపోయిన ఉష్ణోగ్రతలు... 4 రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. ముఖ్యంగా విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పడిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత 7 డిగ్రీల కనీస ఉష్ణోగ్రతగా నమోదైంది. దీంతో ఏజెన్సీ వాసులను చలి వణికిస్తోంది. 4 రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పాడేరులో మంచు జల్లులు కురిశాయి. చలి పంజాలో మన్యం గజగజ వణుకుతోంది. పొగమంచు దట్టంగా కమ్మేసింది. మినుములూరు 7, పాడేరు 8 డిగ్రీలు కనీస ఉష్ణోగ్రత నమోదైంది. మంచు కప్పేస్తున్న కారణంగా.. రహదారిపై రాకపోకలు ఇబ్బందిగా మారాయి. చలి గాలులు అధికంగా వీస్తున్నాయి. ఉదయం, రాత్రి మంచు దట్టంగా కురుస్తోంది. చలి, మంచు కారణంగా వృద్ధులు, చిన్నపిల్లలు, రైతులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇక పాడేరు మంచు ముసుగేసుకుంది. మండలంలో చలి తీవ్రత బాగా పెరిగిపోయింది. పొగ మంచు విపరీతంగా కురుస్తోంది. ఏదీ కనిపించకుండా… మొత్తం పొగ మంచుతో కప్పేసింది. పాడేరులో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.పాడేరు సమీపంలో ఉన్న వంజంగి కొండకు టూరిస్టుల తాకిడి బాగా పెరిగింది. పొగమంచు అందాలతో వంజంగి కొండ సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఉదయాన్నే పాలసముద్రం గ్రాఫిక్స్‌ను తలపించేలా కనిపించే కొండ చుట్టూ పొగమంచును చూడడానికి టూరిస్టులు క్యూ కడుతున్నారు.

విశాఖ మన్యంలోని ప్రజలు చలికి వణుకుతున్నారు. మినుములూరు కాఫీ బోర్డు వద్ద 7 డిగ్రీల కనిష్ట ఉష్టోగ్రతలు నమోదయ్యాయి. పొగ మంచు కారణంగా గిరిజనులంతా తమ ఇంటి పరిసరాల్లో చలి మంటలు వేసుకుంటున్నారు. రాత్రి వేళల్లో చలి మరింతగా విజృంభిస్తుంది. అర్ధరాత్రి నుంచి పొగమంచు దట్టంగా కురుస్తోంది. పాడేరు ఘాట్‌లోని పోతురాజు స్వామి గుడి వద్ద 2 డిగ్రీలు, మినుములూరు కాఫీ బోర్డు వద్ద 7 డిగ్రీల కనిష్ట ఉష్టోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఏజెన్సీలో గిరిజనులు గజగజా వణుకుతున్నారు.