ED arrests MP KD Singh : మనీలాండరింగ్ కేసులో మాజీ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కేడీ సింగ్‌ అరెస్టు

|

Jan 13, 2021 | 6:26 PM

తృణమూల్ కాంగ్రెస్ మాజీ నాయకుడు, రాజ్యసభ ఎంపి కరణ్ దీప్ సింగ్‌(కేడీ) ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అరెస్టు చేసింది. మనీలాండరింగ్..

ED arrests MP KD Singh : మనీలాండరింగ్ కేసులో మాజీ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కేడీ సింగ్‌ అరెస్టు
Follow us on

తృణమూల్ కాంగ్రెస్ మాజీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ కరణ్ దీప్ సింగ్‌(కేడీ సింగ్) ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అరెస్టు చేసింది. మనీలాండరింగ్ కేసులో కేడీ సింగ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటోన్న కేసుకు సంబంధించి జరిగిన లావాదేవీలను వివరించడంలో కేడీ సింగ్ విఫలమైనందున ఆర్థిక దర్యాప్తు సంస్థ అతన్ని అరెస్టు చేసింది. ప్రజల నుండి సేకరించిన నిధులను, ఉద్దేశించిన ప్రయోజనం కోసం ఉపయోగించలేదని, వాటిని వివిధ గ్రూప్ కంపెనీలకు మళ్లించి సొమ్ములు వక్రమార్గం పట్టించారని ఈడీ నిగ్గుతేల్చింది. అయితే, ఈ డబ్బును ఏ ప్రయోజనం కోసం సేకరించి బదిలీ చేస్తున్నారో డైరెక్టర్లు చెప్పలేదని దర్యాప్తు సంస్థ పేర్కొంది. సెబీ ప్రాసిక్యూషన్ ఫిర్యాదు ఆధారంగా ఆల్ కెమిస్ట్ ఇన్‌ఫ్రా రియాలిటీ లిమిటెడ్‌పై మరో కేసును కూడా ఇడి విచారిస్తోంది. రూ. 239.29 కోట్ల విలువైన ఆస్తిని ఇప్పటివరకూ అటాచ్ చేసింది. సెప్టెంబర్ 2019 లో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ న్యూ ఢిల్లీ, చండీగడ్ లోని కేడీ సింగ్‌కు సంబంధించిన ఆఫీసులు, ఇళ్లలో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కరణ్ దీప్ సింగ్‌కు సంబంధించిన, ఇంకా అతని నియంత్రణలో ఉన్న ఆల్ కెమిస్ట్ గ్రూప్‌లోని 14 కంపెనీలకు సంబంధించి ఈ సోదాలు జరిగాయి.

సోదాల సమయంలో అక్రమ లావాదేవీలకు సంబంధించి అనేక పత్రాలు, డిజిటల్ ఆధారాలు, ఇంకా వివిధ రకాల ఆస్తుల పత్రాలు ఈడీ స్వాధీనం చేసుకుంది. ఢిల్లీ లోని కేడీ సింగ్ అధికారిక నివాసంలో జరిపిన సోదాల్లో 32 లక్షల రూపాయల నగదుతో పాటు 10,000 డాలర్ల విదేశీ మారకద్రవ్యం అప్పట్లో రికవరీ చేశారు. 2018లో కేడీ సింగ్.. అతని కుమారుడు, ఆల్ కెమిస్ట్ టౌన్ షిప్ ఇండియా లిమిటెడ్, ఆల్ కెమిస్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్, ఇంకా అనేక ఇతర సంస్థల పేరిట మోసం, నేరపూరిత కుట్రకు సంబంధించిన సెక్షన్ల కింద కోల్‌కతా పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లోని వివరాల ఆధారంగా ఈడీ సోదాలు నిర్వహించింది. కాగా, కేడీ సింగ్ తృణమూల్ కాంగ్రెస్ టికెట్‌పై 2014 ఏప్రిల్‌లో రాజ్యసభకు ఎన్నికయ్యారు.