కేంద్రంతో రైతుల చర్చలు విఫలం, కమిటీ వద్దంటున్న అన్నదాతలు, రేపు మళ్ళీ సంప్రదింపులు

| Edited By: Anil kumar poka

Dec 02, 2020 | 10:52 AM

రైతు చట్టాలపై కేంద్రంతో రైతు సంఘాలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. మంగళవారం సాయంత్రం నుంచి సుదీర్ఘంగా ముగ్గురు మంత్రులతో ఈ సంఘాలు జరిపిన చర్చలు ఎటూ తేలకుండానే ముగియడంతో సంక్షోభం కొనసాగుతోంది.

కేంద్రంతో రైతుల చర్చలు విఫలం, కమిటీ వద్దంటున్న అన్నదాతలు, రేపు మళ్ళీ సంప్రదింపులు
Follow us on

రైతు చట్టాలపై కేంద్రంతో రైతు సంఘాలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. మంగళవారం సాయంత్రం నుంచి సుదీర్ఘంగా ముగ్గురు మంత్రులతో ఈ సంఘాలు జరిపిన చర్చలు ఎటూ తేలకుండానే ముగియడంతో సంక్షోభం కొనసాగుతోంది. వీరి డిమాండ్లపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామన్న మంత్రుల  ప్రతిపాదనను అన్నదాతలు తిరస్కరించారు. ఇప్పుడు కమిటీ ఏర్పాటు వల్ల ప్రయోజనం లేదని, వివాదాస్పద చట్టాలను ఉపసంహరించేంతవరకు తాము తమ డిమాండ్లపై వెనక్కి తగ్గేదిలేదని వారు స్పష్టం చేశారు. దీంతో కేంద్రం రేపు (గురువారం) మళ్ళీ వీరితో చర్చలు జరపనుంది.

ఓ పానెల్ ని ఏర్పాటు చేస్తాం. ఆ పానెల్ లో ఎవరు పాల్గొంటారో వారి పేర్లను రాసి ఇవ్వండి, అలాగే ప్రభుత్వం నుంచి, వ్యవసాయ నిపుణుల నుంచి కొంతమంది కూడా అందులో సభ్యులుగా ఉంటారు. అని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సూచించారు. కానీ ఈ ప్రతిపాదనను రైతులు తిరస్కరించారు. ప్రభుత్వం బలప్రయోగం చేసినా తాము బెదరబోమన్నారు. అటు రైతుల  పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై హర్యానాలో డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జన నాయక్ జనతా పార్టీ కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. సర్కార్ విశాల హృదయంతో ఆలోచించి రైతుల డిమాండ్లను పరిష్కరించాలని దుష్యంత్ చౌతాలా తండ్రి అజయ్ చౌతాలా కోరారు. ఈ పార్టీకి రైతుల్లో మంచి పట్టు ఉన్న విషయం గమనార్హం.

పంజాబ్ కు చెందిన ప్రముఖ క్రీడాకారులు కూడా అన్నదాతల ఆందోళనకు మద్దతు ప్రకటించారు. తమకు ప్రభుత్వం నుంచి లభించిన అవార్డులను తిరిగి వాపసు చేస్తామని, వారంటున్నారు. ఢిల్లీలో అన్నదాతల ఆందోళనకు సంఘీభావంగా ఈ నెల 5 న ఆ నగరానికి వెళ్తామని వీరు ప్రకటించారు. వీరిలో ఒలంపిక్ హాకీ ప్లేయర్, అర్జున్ అవార్డు గ్రహీత సజ్జన్ సింగ్ ఛీమా కూడా ఉన్నారు. రైతుల ఆందోళన పూర్తి న్యాయసమ్మతమైనదిగా ఆయన పేర్కొన్నారు.