
Devi Sarannavaratri Celebrations : శ్రీశైలంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండు రోజుల్లో వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు… మూడోరోజు భ్రమరాంబాదేవి చంద్రఘంటా దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆదిపరాశక్తులో అమ్మవారి మూడోరూపం చంద్రఘంటాదేవి అని పురాణాలు చెబుతున్నాయి.
యుద్ధోన్ముఖురాలై సింహవాహనాన్ని అధిష్టించి పదిచేతుల్లో కుడివైపు ఐదింటిలో పద్మం, బాణం, ధనస్సు, అభయహస్తం, జపమాలలు, ఎడమవైపు చేతుల్లో త్రిశూలం, గద, ఖడ్గం, పంచముద్ర, కమండలాన్ని ధరించి భక్తులకు అమ్మవారు అభయమిచ్చారు. చంద్రఘంటా దేవిని పూజిస్తే కష్టాల నుంచి విముక్తి కలిగి, సౌమ్యం, వినమ్రత కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
చంద్రఘంటా సమేతుడైన శ్రీశైలేశుడు రావణ భుజస్కంధాలపై విహరిస్తూ భక్తజన నిరాజనాలు అందుకున్నాడు. అక్కమహాదేవి అలంకార మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై స్వామిఅమ్మవార్లకు అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. మంగళవారం అమ్మవారు కుష్మాండ దుర్గా అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనుంది.
ఆలయ ఈఓ కేఎస్ రామారావుతోపాటు ఈఈ బాలమురళీకృష్ణ, చీఫ్ సెక్యూరిటీ అధికారి శ్రీహరి, పౌర సంబంధాల అధికారి శ్రీనివాసరావు, శ్రీశైల ప్రభ ఎడిటర్ అనిల్కుమార్, ఏఈఓ హరిదాస్, డి.మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.