
Covid Vaccine Dry Run: కోటి మందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయడమే లక్ష్యంగా జగన్ సర్కార్ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఈరోజు నుంచి రెండు రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టుగా కరోనా వ్యాక్సిన్ ‘డ్రై రన్’ జరగనుంది. నేడు కృష్ణాజిల్లాలోని గన్నవరంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఐదు సెంటర్లలో ఎంపిక చేయబడిన 125 మందికి డమ్మీ టీకాలు వేయనున్నారు. వీటిని పర్యవేక్షించడానికి ఐదుగురు వ్యాక్సినేషన్ ఆఫీసర్లు నియామకం కావడమే కాకుండా.. కలెక్టర్ అద్యక్షతన స్పెషల్ టాస్క్ఫోర్స్ ఏర్పాటైంది.
ముఖ్యంగా కరోనా వ్యాక్సినేషన్లో తలెత్తే లోపాలను గుర్తించేందుకు ఈ ‘డ్రై రన్’ను నిర్వహిస్తున్నారు. ముందుగా సమీప డిపో నుంచి వాక్సినేషన్ కేంద్రానికి టీకాలను తరలిస్తారు. ఇక టీకా ఇచ్చిన తర్వాత ఎస్ఎమ్ఎస్లో వ్యాక్సిన్ ఇచ్చిన అధికారి పేరు, సమయం వస్తుంది. టీకా తీసుకున్న తర్వాత అరగంటపాటు అక్కడే కూర్చోవాల్సి ఉంటుంది. ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తే.. వెంటనే ట్రీట్మెంట్ చేసేలా కృష్ణా జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ఆ సమాచారాన్ని సెంట్రల్ సర్వర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి చేరవేస్తారు. ఈ ట్రయిల్ రన్ తర్వాత టీకా వేసే తేదీపై నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఇప్పటికే స్టేట్ వ్యాక్సిన్ స్టోరేజ్ సెంటర్కు 30 లక్షల సిరంజీలు చేరగా.. త్వరలోనే ఇక్కడ 57 వేల లీటర్ల టీకాను భద్రపరచనున్నారు. తొలి విడతగా ఫ్రంట్లైన్ వర్కర్స్, 50 ఏళ్లు దాటిన వారికి టీకా ఇవ్వనున్నారు.
కాగా, ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ ‘డ్రై రన్’ జరగనుంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, పంజాబ్, అస్సాం రాష్ట్రాల్లోని రెండేసి జిల్లాల్లో 2 రోజులపాటు పైలెట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమం జరుగుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే.