ఇండియాలో కరోనావైరస్ రోజురోజుకూ విజృంభిస్తోన్న నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ భక్తులు, ఎన్నారైలు భారత్కి వచ్చిన 28 రోజులపాటు తిరుమల వెంకన్న దర్శనానికి రావొద్దని విజ్ఞప్తి చేసింది. ప్రతి రోజూ వేల సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకోడానికి వస్తుంటారు. భక్తులతో ఆలయం నిత్యం కిటకిటలాడుతుంటుంది. అందుకే స్వామివారి సన్నిధిలో కరోనా ప్రభలకుండా టీటీడీ..విదేశీ, ఎన్నారై భక్తులను రిక్వెస్ట్ చేస్తోంది.
ఇక మరోవైపు అనారోగ్యంతో ఉన్న లోకల్ భక్తులు సైతం తిరుమలకు రావొద్దని టీటీడీ కోరింది. శబరిమల దేవస్థానం సైతం ఈ తరహా ప్రకటనే చేసింది. మార్చి నెల ముగిసే వరకు భక్తులు అయ్యప్ప దర్శనానికి రాకపోవడమే మంచిదని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డ్ ప్రెసిడెంట్ ఎన్.వాసు తెలిపారు.
చైనాలో ప్రారంభమైన కరోనా మహమ్మారి ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా 100 దేశాలకు పైగా విస్తరించింది. చైనాలో కరోనా మృతుల సంఖ్య 3,136కు చేరుకుంది. మరోవైపు ఇటలీలో కూడా కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రజలెవరైనా బయటకు వస్తే జైల్లే పెడతామని హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య ప్రస్తుతం అందుతోన్న అధికారిక లెక్కల ప్రకారం 4,091 గా ఉంది. కాగా భారత్లో ఇప్పటివరకు 59 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.