కరోనా సంక్షోభం.. బాధితులు కూడా చాలా మంది ఉన్నారు.. కానీ, ఆస్పత్రుల్లో నర్సులు, పారామెడికల్ సిబ్బంది సరిపడా లేరు. దీంతో ఆదాయానికి భారీగా గండి పడింది. ఫలితంగా ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు విలవిలలాడిపోతున్నాయి. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులను ఇప్పుడు వేధిస్తున్న ప్రధానసమస్య నర్సుల కొరత. ఇతర పారామెడికల్ సిబ్బంది కూడా సరిపడాలేరు. ఈ నేపథ్యంలో నర్సులకు భారీ ఆఫర్లు, ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి కార్పొరేట్ ఆసుపత్రులు.
కొవిడ్ చికిత్సలో నర్సుల పాత్ర కీలకంగా మారింది. దీంతో ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు.. నర్సులు, పారామెడికల్ సిబ్బందికి రూ.50 వేల జీతం, ఉచిత వసతి కల్పిస్తామంటూ ప్రకటనలిస్తున్నాయి. సర్కారు విడుదల చేసిన లెక్కల ప్రకారమే 95 ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో 5,494 పడకలు కరోనా కోసం కేటాయించగా, అందులో 2,197 ఖాళీగా ఉన్నాయి. రోగులు భారీగా వస్తున్నా పడకలు లేవంటున్నాయి. సిబ్బంది కొరతతోనే తాము అలా చెప్పాల్సి వస్తుందని ఆసుపత్రులు పేర్కొంటున్నాయి.
నర్సింగ్ కోర్సు అయిపోయి, రిజిస్ట్రేషన్ చేయించుకోనివారైనా ఫర్వాలేదని హాస్పిటల్స్ ఆహ్వానిస్తున్నాయి. నర్సింగ్ అసోసియేషన్ లెక్కల ప్రకారం 30 శాతం మంది నర్సులు అనారోగ్యానికి గురవుతున్నారు. దీంతో వారంతా సెలవులు పెడుతున్నారు. చాలామంది భయాందోళనకు గురవుతూ తక్కువ జీతాలకు పనిచేయబోమని రాజీనామా చేసి ఇళ్లకు వెళ్లిపోయారు. నర్సులు కావాలంటూ వివిధ రాష్ట్రాల్లో ప్రకటనలు వేసి రప్పించేందుకు కార్పొరేట్ ఆసుపత్రులు ప్రయత్నిస్తున్నాయి. ఒక గుంపుగా ఎక్కువమంది వచ్చేట్లయితే వారికోసం ఒక చార్టర్డ్ ఫ్లైట్ను బుక్ చేసేందుకూ కార్పొరేట్ యాజమాన్యాలు సిద్ధమయ్యాయి.