
రెండు తెలుగురాష్ట్రాల సీఎంల మధ్య రోజురోజుకు స్నేహబంధం పెరుగుతున్నట్టే కనిపిస్తోంది. గతానికి ఇప్పటికీ ఎంతో తేడా కనిపిస్తోంది. జగన్ సీఎం కాకముందు నుంచే తెలంగాణ సీఎంతో స్నేహపూర్వకమైన అడుగులు వేసారు జగన్. ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సైతం కేసీఆర్ హాజరై జగన్కు పాలనాపరమైన హితబోధను సైతం చేశారు. ఇక ఇరు రాష్ట్రాల సీఎంలు జలవనరుల వినియోగంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మరోవైపు విభజన చట్టంలో పరిష్కారం కాని అంశాలపై చర్చించేందుకు రేపు 28వ తేదీన ఇద్దరు సీఎంలు భేటీ కానున్నారు. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ఏపీ సీఎం జగన్ ఇవాళ హైదరాబాద్కు వచ్చారు.
ఇదిలా ఉంటే టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్కు విచ్చేశారు. అక్కడ ఆయన పని పూర్తయిన తర్వాత తిరిగి ప్రగతిభవన్కు వెళ్లబోయే సమయంలో జగన్ కాన్వాయ్ అటువైపుగా వస్తున్నట్టు భద్రతాధికారులు తెలంగాణ సీఎం కేసీఆర్కు సమాచారం అందించారు. దీంతో అప్పటికే కేసీఆర్ బయలుదేరాల్సి ఉన్నప్పటికీ జగన్ కోసం కాసేపు ఆగారు. జగన్ కాన్వాయ్ వెళ్లిన కొద్దిసేపటికి కేసీఆర్ వెళ్లారు.