CM Jagan Flag Off Ration Door Delivery Vehicles Live Updates: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలో భాగంగా మరో పథకానికి శ్రీకారం చుట్టారు. దేశంలోనే తొలిసారిగా ప్రజా పంపిణీ వ్యవస్థలో సరికొత్త విధానానికి తెరతీస్తూ.. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇంటికే రేషన్ సరుకులు అందించే కార్యక్రమాన్ని విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద సీఎం జగన్ ప్రారంభించారు.
రేషన్ డెలివరీ కోసం ప్రవేశపెట్టిన వాహనాలను కడప జిల్లాలో ఇన్ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, డిప్యూటీ సీఎం ఆంజాద్బాషా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కలెక్టర్ హరి కిరణ్ పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 514 వాహనాలు ఇంటకే రేషన్ సరుకులు అందజేయడానికి సిద్ధంగా ఉన్నాయి.
ఇంటికే రేషన్ సరుకులను అందజేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన మోబైల్ వాహనాలను శ్రీకాకుళంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు. కోడి రామ్మూర్తి నాయుడు మైదానంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంటికే రేషన్ సరుకులు డెలివరీ చేసేందుకు గాను ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 9,260 వాహనాలను ఉపయోగించనుంది. ఈ వాహనాల కోసం ప్రభుత్వం రూ.539 కోట్లు ఖర్చు చేసింది. ఫిబ్రవరి 1నుంచి ఇంటికే రేషన్ విధానం ప్రారంభం కానుంది.
రేషన్ సరుకులు ఇంటికి డోర్ డెలివరీ చేసే క్రమంలో కల్తీ జరగడానికి ఎలాంటి ఆస్కారం లేకుండా అధికారులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ప్రతీ బియ్యం బస్తాకు సీల్తోపాటు యూనిక్ కోడ్ ద్వారా ఆన్లైన్ ట్రాకింగ్ ఏర్పాటు చేయనున్నారు.
డోర్ డెలివరీ కోసం కేటాయించిన వాహనాలను సీఎం ప్రారంభించిన వెంటనే విజయవాడ రోడ్లపై వాహనాలు బార్లు తీరాయి. ఒకేసారి 2,500 వాహనాలు రోడ్లపై క్యూ కట్టిన దృశ్యం ఆకట్టుకుంటోంది.
డోర్ డెలివరీ కోసం కేటాయించిన వాహనాలను ప్రారంభించేందుకు బెంజ్ సర్కిల్ చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. అక్కడ ఉన్న వాహనాలను పరిశీలిస్తున్నారు. ఈ సందర్బంగా అక్కడి డ్రైవర్లతో చర్చిస్తున్నారు.
ఇంటికే రేషన్ సరుకులను అందించే వాహనాలను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కాసేపటి క్రితమే విజయవాడ బెంజ్ సర్కిల్ చేరుకున్నారు. జగన్కు నాయకులు స్వాగతం పలుకుతున్నారు.
మూడు జిల్లాలకు కేటాయించిన వాహనాలను ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి ప్రారంభించనుండగా.. మిగిలిన జిల్లాలకు కేటాయించిన వాహనాలను మంత్రులు ప్రారంభించనున్నారు. ఇక రేషన్ సరుకుల డోర్ డెలివరీని ఫిబ్రవరి 1నుంచి ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే మొత్తం 9,260 వాహనాలు సిద్ధం చేశారు.
ఇంటి వద్దకే రేషన్ సరుకులను అందజేసే ఉద్దేశంతో ప్రవేశ పెట్టనున్న కొత్త పథకం కోసం ముఖ్యమంత్రి మరికాసేపట్లో వాహనాలను ప్రారంభించనున్నారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి 2,500 రేషన్ డోర్ డెలివరీ వాహనాలను విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద జగన్ జెండా ఊపి ప్రారంభిస్తారు.
రేషన్ సరుకుల కోసం వృద్ధులు, రోగులు ఎదుర్కొంటున్న అవస్థలను గుర్తించిన జగన్ ఇంటివద్దకే సరుకులను అందజేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆ హామీని నెరవేర్చే దిశగా ఇంటివద్దకే రేషన్ సరుకుల సరఫరా వాహనాలను సీఎం జగన్ ప్రారంభించబోతున్నారు.