హోంమంత్రి హామీతో అర్థరాత్రి మరియమ్మకు అంత్యక్రియలు .. నిరువుగప్పిన నిప్పులా మారిన వెలగపూడి

|

Dec 29, 2020 | 2:27 PM

గుంటూరు జిల్లా వెలగపూడి ఎస్సీ కాలనీలో టెన్షన్‌ కొనసాగుతోంది. బాధితులు ఆందోళన విరమించినా.. మళ్లీ ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌లో ఉన్నారు జనం.

హోంమంత్రి హామీతో అర్థరాత్రి మరియమ్మకు అంత్యక్రియలు .. నిరువుగప్పిన నిప్పులా మారిన వెలగపూడి
Follow us on

గుంటూరు జిల్లా వెలగపూడి ఎస్సీ కాలనీలో టెన్షన్‌ కొనసాగుతోంది. బాధితులు ఆందోళన విరమించినా.. మళ్లీ ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌లో ఉన్నారు జనం. నాలుగు రోజులుగా సాగుతున్న వివాదంలో ఇరువర్గాలు పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. 8 మంది గాయపడ్డారు. మరియమ్మ మృతికి కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ ఆమె కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. తుళ్లూరు –వెలగపూడి ప్రధాన రహదారిపై మృతదేహంతో నిరసన చేపట్టారు. వివాదం ముదరడానికి కారణమైన తుళ్లూరు సీఐ ధర్మేంద్రబాబును సస్పెండ్‌ చేయాలని నినాదాలు చేశారు.

ఎంపీ సురేష్ పేరును ఎఫ్ఐఆర్లో చేరుస్తామని హోం మంత్రి హామీ ఇవ్వడంతో అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మరియమ్మ మృతదేహానికి గ్రామస్తులు అంత్యక్రియలు నిర్వహించారు. ఎస్సీ కాలనీలో ఆర్చి నిర్మాణం విషయంలో తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారగా 50 సంవత్సరాల మరియమ్మ అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. గ్రామంలోని ఎస్సీ కాలనీ లో కొత్తగా వేసిన సిమెంట్ రహదారి ప్రారంభంలో ఆర్చి నిర్మాణం విషయంలో తలెత్తిన వివాదం కాలనీవాసులు మధ్య చిచ్చు పెట్టింది. ఆర్చి నిర్మాణానికి ఓ వర్గం వారు బాబు జగ్జీవన్ రామ్ పేరు పెట్టాలని పేర్కొనగా, మరో వర్గం అభ్యంతరం తెలిపింది.

తుళ్లూరు సీఐ ధర్మేంద్రబాబును వీఆర్‌కు పంపారు డీఐజీ త్రివిక్రమ్ వర్మ. ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అల్లర్లకు కారణమైన ఎంపీ నందిగం సురేష్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలన్న బాధితుల డిమాండ్‌. హోం మంత్రి హామీతో ఆందోళన విరమించినా.. పరిస్థితులు ఎలాంటి టెన్షన్‌కు దారితీస్తాయో అన్న అనుమానాలు కల్గుతున్నాయి.