భూసర్వేపై జగన్ కేబినెట్ సంచలన నిర్ణయం

|

Nov 05, 2020 | 5:43 PM

తెలంగాణ మాదిరిగా ఏపీలోను భూములపై రీ-సర్వే నిర్వహిస్తారా ? లేదా ? అనే విషయంలో రాష్ట్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూమి హక్కు- భూమి రక్షణ...

భూసర్వేపై జగన్ కేబినెట్ సంచలన నిర్ణయం
Follow us on

Cabinet sensational decision on land survey: తెలంగాణ మాదిరిగా ఏపీలోను భూములపై రీ-సర్వే నిర్వహిస్తారా ? లేదా ? అనే విషయంలో రాష్ట్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూమి హక్కు- భూమి రక్షణ పేరుతో అన్ని భూముల రీ-సర్వే జరపించాలని కేబినెట్ గురువారం నిర్ణయించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భూములన్నింటినీ రీ-సర్వే జరపనున్నట్లు కేబినెట్ సమావేశం వివరాలను వెల్లడించిన వ్యవసాయ మంత్రి కన్నబాబు తెలిపారు. భూముల రీ-సర్వే కోసం రూ. 1000 కోట్లు కేటాయించనున్నట్లు ఆయన వెల్లడించారు.

వచ్చే ఏడాది జనవరి నుంచి జూన్ 2023 నాటికి దశల వారీగా రీ-సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం తలపెట్టింది. ఇందుకోసం నాలుగు వేల అయిదు వందల బృందాలను ఎంపిక చేయనున్నారు. రీ-సర్వేలో ఉత్పన్నమయ్యే భూ సమస్యల పరిష్కారానికి మొబైల్ కోర్టులను ఏర్పాటు చేయాలని కేబినెట్ తీర్మానించింది. ‘‘ ఫిజికల్ బౌండరీలను ఫిక్స్ చేస్తాం.. సర్వే రాళ్లను ప్రభుత్వమే ఇస్తుంది.. గ్రామ సచివాలయంలోనే రిజిస్ట్రేషన్లు జరిగేలా చర్యలు తీసుకుంటాం.. 100 ఏళ్ల తర్వాత మళ్లీ భూ సర్వేను చేయబోతున్నాం…’’ అని కన్నబాబు వివరించారు.

రాష్ట్రంలో కొత్త ఇసుక పాలసీని అమల్లోకి తెచ్చే విషయంపై కూడా ఏపీ కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. ‘‘ ఇసుక విధానాన్ని ఖరారు చేసేందుకు ప్రజల సలహాలు స్వీకరించాం.. ఇసుక రీచుల నుంచి నేరుగా వినియోగదారులకు సరఫరా చేస్తాం.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఇసుక రీచులను అప్పగిస్తాం.. ఎన్ఎండీసీ వంటి 8 సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నాం.. ఒక వేళ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ముందుకు రాకుంటే ఇసుక రీచులను ప్రైవేటు సంస్థలకు బిడ్డింగ్ ద్వారా ఇస్తాం.. నాలుగు జిల్లాలను ఓ జోనుగా చేసి ఇసుక రీచుల నిర్వహణపై బిడ్డింగులు పిలుస్తాం.. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఇసుకను అమ్మాలి.. ఆన్ లైన్లో కాకుండా ఆఫ్ లైన్లో కూడా ఇసుక బుకింగులు చేసుకోవచ్చు.. ఆర్ అండ్ ఆర్ కాలనీలకు.. బలహీన వర్గాల గృహ సముదాయాలకు సబ్సిడీతో ఇసుక అందిస్తాం.. పట్టా భూముల నుంచి ఇసుక తవ్వకాలకు అనుమతులు రద్దు చేస్తాం.. ’’ అని మంత్రి తెలిపారు.

రాష్ట్రంలో స్పెసల్ ఎన్‌ఫోర్స్‌మెంటు బ్యూరో (ఎస్ఈబీ)ని బసోపేతం చేస్తున్నామని కన్నబాబు ప్రకటించారు. అదనపు పోస్టులను క్రియేట్ చేసి.. అవుట్ సోర్సింగ్, డెప్యూటేషన్ విధానాలలో వాటిని భర్తీ చేస్తామన్నారు. గ్యాంబ్లింగ్, బెట్టింగ్, డ్రగ్స్ వంటి వాటిని ఎస్ఈబీ పరిధిలోకి తెస్తున్నామని తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణను అరికట్టేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి.. దానిని ఎస్ఈబీని అనుసంధానం చేయాలని కేబినెట్ నిర్ణయించినట్లు మంత్రి వివరించారు.

వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని నవంబర్ 17న ప్రారంభించాలని, గత ప్రభుత్వంలోని సున్నా వడ్డీ బకాయిలు రూ.1051 కోట్లను తక్షణం చెల్లించాలని కేబినెట్ నిర్ణయించిందని కన్నబాబు తెలిపారు. ఏ సీజనులో జరిగిన పంట నష్టానికి ఆ సీజనులోనే నష్టపరిహారం అందిస్తున్నామని చెప్పుకొచ్చిన కన్నబాబు.. అక్టోబర్ పంట నష్టం నవంబర్ పదో తేదీన ఎన్యూమరేషన్ పూర్తి అవుతుందన్నారు. నవంబర్ నెలాఖరులోగానే ఇన్ పుట్ సబ్సిడీని అందిస్తామని ఆయన తెలిపారు.

శ్రీకాకుళం, కడప జిల్లాల్లో క్రికెట్ స్టేడియాల నిర్మాణానికి భూములను కేటాయించిన కేబినెట్.. ఐదేళ్ల శిక్షా కాలాన్ని పూర్తి చేసుకున్న 48 ఏళ్లకు పైబడిన మహిళలకు విముక్తి ఇవ్వాలని తీర్మానించింది. ఈ మేరకు గవర్నర్ ఆమోదం కోరాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. 500 లీటర్ల కంటే ఎక్కువగా పాల సేకరణకు అవకాశం ఉన్న సుమారు 9 వేలకు పైగా గ్రామాల్లో మహిళల నేతృత్వంలో పాల సేకరణ కేంద్రాల ఏర్పాటు చేయాలని కేబినెట్ తీర్మానించింది. ఆర్బీకే వద్దే పాల సేకరణ కేంద్రాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది. పశువుల దాణాను ఆర్బీకే కేంద్రాల ద్వారా సరఫరా చేయాలని నిర్ణయించారు. ఆక్వా కల్చర్ సీడ్ యాక్ట్-2020కు కేబినెట్ ఆమోదం తెలపింది. ఫిష్ ఫీడ్ క్వాలిటీ కంట్రోల్ యాక్ట్ తీసుకురాబోతున్నామని మంత్రి తెలిపారు.

రాష్ట్రంలోని ఎనిమిది మెడికల్ కాలేజీలకు భూముల కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గుంటూరు ప్రభుత్వాస్పత్రి విస్తరణకు 6 ఎకరాల కేటాయించారు. విజయవాడలో అనాధాశ్రమం, శిశు భవన్ కోసం మిషనరీ ఆఫ్ ఛారిటీస్‌కు లీజు పద్దతిన భూమి కేటాయించాలని ఏపీ కేబినెట్ తీర్మానించింది. మూడున్నర గంటల పాటు జరిగిన కేబినెట్ భేటీలో పలు రాజకీయాంశాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం.

ALSO READ: బందరు పోర్టుపై కేబినెట్ కీలక నిర్ణయం

ALSO READ: చంద్రబాబు ఆరోపణ తప్పని తేల్చిన కేబినెట్

ALSO READ: టీడీపీ నేతలకు ‘సుప్రీం’ నోటీసులు

ALSO READ: వండర్ కలెక్టర్ టీచరైన వేళ!

ALSO READ: పాకిస్తాన్ మరో దుష్ట పన్నాగం.. ఇండియా తీవ్ర అభ్యంతరం