Calling Bell Facility At Corona Patients Beds: కరోనాపై పోరులో భాగంగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల బెడ్స్ వద్ద కాలింగ్ బెల్స్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కొన్ని ఆసుపత్రుల్లో వైద్యులు తరచుగా రోగుల వద్దకు వెళ్లడం లేదన్న విమర్శలు వస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రోగికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు కాలింగ్ బెల్ నొక్కితే.. డాక్టర్ లేదా నర్సు వచ్చి అతడి పరిస్థితిని పర్యవేక్షించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న అన్ని కోవిడ్ ఆసుపత్రుల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు వైద్యారోగ్య శాఖ సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేసింది.
ఐసీయూ, నాన్ ఐసీయూ, ఆక్సిజన్, జనరల్ వార్డుల్లో ఈ బెల్స్ను ఏర్పాటు చేయనున్నారు. ఇక వీటన్నింటిని రిసెప్షన్కు అనుసంధానం చేస్తారు. రోగి బజర్ నొక్కిన దగ్గర నుంచి డాక్టర్ లేదా నర్సు వచ్చేవరకూ బెల్ మోగుతూనే ఉంటుంది. ఇక అటు రోగులకు డాక్టర్లు, వైద్య సిబ్బంది అందిస్తున్న సేవల పరిశీలనకు ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఆసుపత్రుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. కాగా, కరోనా నిర్ధారణ టెస్టులను మరింత ఎక్కువగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. ముఖ్యంగా కరోనా లక్షణాలు కనిపిస్తున్నవారికి, జ్వరం, జలుబు ఉన్నవారికి, 60 ఏళ్లు పైబడిన వారికి, దీర్ఘకాలిక రోగాలు, క్యాన్సర్తో బాధపడుతున్న వారికి పరీక్షలు చేయనున్నారు.
Also Read:
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పల్లెల్లోనూ మాస్క్ తప్పనిసరి.. లేదంటే జరిమానా!
కోవిడ్ ఇన్ఫెక్షన్లు ఆరు రకాలు.. ఆ లక్షణాలు ఉంటే జాగ్రత్త.!