AP New Districts: ఏపీలో వేగంగా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ.. మాయం కానున్న తూర్పు, పశ్చిమ కృష్ణా జిల్లాలు

|

Jan 10, 2021 | 1:11 PM

ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగం పుంజుకుంది. లోక్‌సభ నియోజకవర్గాలనే ప్రాతిపదికగా తీసుకుని కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. 26 జిల్లాలు ఏర్పాటుకు, మొత్తం 57 రెవెన్యూ డివిజన్ల..

AP New Districts: ఏపీలో వేగంగా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ.. మాయం కానున్న తూర్పు, పశ్చిమ కృష్ణా జిల్లాలు
Follow us on

AP New Districts: ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగం పుంజుకుంది. లోక్‌సభ నియోజకవర్గాలనే ప్రాతిపదికగా తీసుకుని కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. 26 జిల్లాలు ఏర్పాటుకు, మొత్తం 57 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రతిపాదిస్తూ ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీ నివేదిక ఇచ్చింది. అయితే అరకు లోక్‌సభ నియోజకవర్గంలో పాడేరు, పార్వతీపురం కేంద్రంగా రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని సూచించింది. అరకు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 7 నియోజకవర్గాలను విభజించి 2 జిల్లాల ఏర్పాటుకు ప్రతిపాదించింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా కొత్త పోలీసు జిల్లాల హద్దులపై ఆ శాఖ దృష్టిసారించాలని సూచించింది. విద్య, ఆరోగ్యం, అటవీ, వాణిజ్యపన్నులు, ఇంజినీరింగ్‌ తదితర శాఖలు కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లకు అనుగుణంగా అవసరమైన చర్యలు చేపట్టాలని పేర్కొంది. ఈ సందర్భంగా తెలంగాణలో ఆదిలాబాద్‌ జిల్లా ఏర్పాటుకు అనుసరించిన విధానాలను ప్రస్తావించింది.

పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు అసెంబ్లీ నియోజకవర్గాలను అరకు-1 పరిధిలోకి తీసుకొస్తారు. అరకువ్యాలీ, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాలను అరకు-2 పరిధిలోకి తేవాలని సూచించారు. కొత్తగా ఏర్పాటయ్యే వాటిలో అరకు-1 జిల్లాకు పార్వతీపురం, అరకు-2 జిల్లాకు పాడేరు, హిందూపురం జిల్లాకు హిందూపురం లేదా పెనుకొండను జిల్లా కేంద్రాలుగా ప్రతిపాదించింది.

అధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం తాజాగా ఏపీలో అరకు-1, అరకు-2, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, రాజమండ్రి, నర్సాపురం, అమలాపురం, కాకినాడ, ఏలూరు, ఒంగోలు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, నెల్లూరు, కడప, నంద్యాల, రాజంపేట, కర్నూలు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం, హిందూపురం జిల్లాలు ఏర్పాటు అవుతాయి. కొత్త జిల్లాలు ఏర్పాటు అయితే ఇప్పటి వరకు ఉన్న తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల పేర్లు మాయం కానున్నాయి.

కొత్త జిల్లాలు ఏర్పడుతుండడంతో రాష్ట్రంలోని 38 రెవెన్యూ డివిజన్లలో మార్పుచేర్పులు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. కొత్తగా 9 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతోపాటు, ప్రస్తుతమున్న వాటిలో మూడింటి రద్దుకు ప్రతిపాదించింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్‌ పరిధిలోని ఉదయగిరి నియోజకవర్గ మండలాలను కందుకూరు డివిజన్‌లోకి..  ఆత్మకూరు నియోజకవర్గ మండలాలను నెల్లూరు డివిజన్‌లోకి …  పశ్చిమ గోదావరి జిల్లా కుకునూరు డివిజన్‌ పరిధిలోని పోలవరం నియోజకవర్గ మండలాలను కొత్తగా ఏర్పాటయ్యే జంగారెడ్డిగూడెం డివిజన్‌లోకి చేర్చాలని ప్రతిసాదించింది. ప్రతి జిల్లాలో 2 నుంచి 3 డివిజన్లు ఉండాలని కమిటీ సూచించింది.

Also Read: https: పసిడి ప్రియులకు శుభవార్త .. డాలర్ బలపడటంతో దిగివస్తున్న బంగారం ధర