కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ మే 3వ తేదీతో ముగుస్తుంది. లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలు అవుతున్నా పాజిటివ్ కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. వైరస్ విరుగుడుకు ఇప్పటి వరకు సరైన ఔషధం లేకపోవడంతో భౌతిక దూరం, లాక్డౌన్తోనే కరోనాను కట్టడి చేయగలమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంక్షలను మరికొన్ని రోజులపాటు పొడిగించే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మే 16 వరకు లాక్డౌన్ను పొడిగించాలని డిమాండ్ చేస్తున్నాయి రాష్ట్రాలు. దేశంలోని చాలా రాష్ట్రాలు లాక్డౌన్ను పొడిగించడానికే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది.
దీనిపై ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చాయి. రాష్ట్రంలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో లాక్డౌన్ వ్యూహాన్నే అమలు చేస్తామని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలోనే పలు దుకాణాలకు లాక్డౌన్ నుంచి వెసులుబాటు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీ సర్కారు బాహాటంగానే తప్పుపట్టింది. మరోవైపు మహారాష్ట్రలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండటంతో లాక్డౌన్ తప్ప మరో దారి లేదని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఒక్కసారిగా లాక్డౌన్ ఎత్తివేస్తే పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగి వైద్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే అభిప్రాయాన్ని గుజరాత్, రాజస్తాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మే 7వ తేదీ వరకు లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలు చేస్తామని ప్రకటించింది. మరో నెల రోజులు ఇలాగే ఉంటుందని సీఎం కేసీఆర్ హింటిచ్చారు. అయితే లాక్డౌన్ పొడిగింపుపై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించిన అనంతరం తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి.