అమరావతి: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై సీనియర్ ఐపియస్ అధికారి…కొద్ది రోజుల క్రితం వరకు ఇంటలిజెన్స్ చీఫ్ గా పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావు పరువు నష్టం దావా వేసేందుకు సిద్దమవుతున్నారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా ఏబీ వెంకటేశ్వరరావుపై వైసీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. ఫలితంగా ఆయన్ను ఎన్నికల విధుల నుండి తప్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీనిని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు సైతం ఎన్నికల సంఘం ఆదేశాలను అమలు చేయాలని స్పష్టం చేయటంతో ప్రభుత్వం ఆయన్ను రిలీవ్ చేసింది. తాజాగా ఏబీ వెంకటేశ్వరరావుపై సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల వ్యవహారం ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన నిరాధార వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేస్తానని ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డి తనపై నిరాధార, హేయమైన ఆరోపణలు చేశారని ఆయన మండిపడ్డారు. ఢిల్లీలో ఈసీ ఆఫీస్ ముందు విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడిన అనంతరం తనకు కాంట్రాక్ట్లు ఉన్నాయని ఆరోపించారని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. ప్రభుత్వ ఏజెన్సీలు, సబ్ కాంట్రాక్టర్లతో తనకు, తమ కుటుంబ సభ్యులకు సంబంధాలు లేవని వెంకటేశ్వరరావు తెలిపారు. నిరాధారమైన ఆరోపణలు చేసినవారిపై పరువు నష్టం దావా వేస్తానని ఆయన స్పష్టం చేశారు.