ఈఎంఐల వడ్డీపై ఇదే లాస్ట్ ఛాన్స్ : సుప్రీం కోర్టు
కొవిడ్ -19 మారిటోరియం నేపథ్యంలో రుణగ్రహీతలపై వడ్డీ భారం పడకుండా రెండు వారాల్లోగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులు, ఆర్బీఐ ఓ నిర్ధిష్ట విధానంతో కోర్టు ముందుకు రావాలని..
కొవిడ్ -19 మారిటోరియం నేపథ్యంలో రుణగ్రహీతలపై వడ్డీ భారం పడకుండా రెండు వారాల్లోగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులు, ఆర్బీఐ ఓ నిర్ధిష్ట విధానంతో కోర్టు ముందుకు రావాలని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. మారటోరియం వ్యవధిలో నిలిచిపోయిన ఈఎంఐలపై వడ్డీ వసూలు చేయరాదని దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. కరోనా లాక్ డౌన్ వేళ ఈఎంఐల చెల్లింపుపై ఆర్బీఐ ఆరు నెలల మారటోరియం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మారటోరియం వ్యవధిలో నిలిచిపోయిన ఈఎంఐలపై వడ్డీ వసూలు చేస్తామని బ్యాంకులు ప్రకటించాయి. వడ్డీపై వడ్డీ వసూలు సరైంది కాదని సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ కేసును మరోసారి వాయిదా వేసేందుకు నిరాకరించిన సర్వోన్నత న్యాయస్ధానం ఇదే చివరి అవకాశమని రెండు వారాల్లోగా రుణగ్రహీతలకు భారం పడనివిధంగా పరిష్కారంతో అఫిడవిట్ సమర్పించాలని కోరింది. బదులుగా రుణగ్రహీతలకు ఊరట ఇచ్చేలా బ్యాంకులతో ఉన్నతస్ధాయిలో సంప్రదింపులు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు వివరించింది. మరోవైపు సెప్టెంబర్ చివరివారంలో కేసు విచారణ తిరిగి ప్రారంభమయ్యేవరకూ ఆయా ఖాతాలను నిరర్ధక ఆస్తులుగా పరిగణించరాదని కోర్టు స్పష్టం చేసింది.