ఉత్తరాఖండ్‌ జలప్రళయం: సహాయక చర్యలకు అవాంతరాలు, రిషిగంగా నదిలో నీటిమట్టం పెరగడంతో కొన్ని గంటలపాటు బ్రేక్‌

ఉత్తరాఖండ్‌ జలప్రళయం తర్వాత కొనసాగుతున్న సహాయక చర్యలకు అవాంతరాలు తప్పడం లేదు. రిషిగంగా నదిలో నీటిమట్టం పెరగడంతో సహాయక చర్యల్ని ఇవాళ..

ఉత్తరాఖండ్‌ జలప్రళయం: సహాయక చర్యలకు అవాంతరాలు, రిషిగంగా నదిలో నీటిమట్టం పెరగడంతో కొన్ని గంటలపాటు బ్రేక్‌
'చమోలీ'.. జల విలయం
Follow us

|

Updated on: Feb 11, 2021 | 9:24 PM

ఉత్తరాఖండ్‌ జలప్రళయం తర్వాత కొనసాగుతున్న సహాయక చర్యలకు అవాంతరాలు తప్పడం లేదు. రిషిగంగా నదిలో నీటిమట్టం పెరగడంతో సహాయక చర్యల్ని ఇవాళ కొంతసేపు నిలిపేశారు. తర్వాత కొంచెం మేర ప్రవాహ ఉదృతి తగ్గడంతో తపోవన్ సొరంగం దగ్గర సహాయక చర్యల్ని పరిమితంగా ప్రారంభించారు. అటు, వరదలో గల్లంతై.. తపోవన్​ సొరంగంలో చిక్కుకున్నట్లు భావిస్తున్న వారిని రక్షించేందుకు చేపట్టిన డ్రిల్లింగ్ ఆపరేషన్​ కూడా కొంతసేపు అర్ధాంతరంగా నిలిచిపోయింది. తవ్వకాలు జరిపే యంత్రం​ చెడిపోవడంతో ఆపరేషన్ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఇక.. తపోవన్ విద్యుత్​ కేంద్రం వద్ద ఉన్న రెండో సొరంగంలో 120 మీటర్లకు పైగా శిథిలాలను తొలగించినట్లు తెలుస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర గవర్నర్ బేబీ రాణి మౌర్య పర్యటించారు. ఐటీబీపీ అధికారులతో సహాయక చర్యలపై చర్చించారు.

మరోవైపు, ఉత్తరాఖండ్ జలవిలయానికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలను ఇస్రో విడుదల చేసిన సంగతి తెలిసిందే. వరద ఉధృతికి ముందు.. తర్వాత గల తేడాలను ఈ చిత్రాల ద్వారా ఇస్రో తెలిపింది. ఈ చిత్రాలను కార్టొశాట్​-3 శాటిలైట్ తీసింది. వరదల వల్ల రిషీ గంగా, ధౌళి గంగా నదీ పరివాహక ప్రాంతాల్లోని డ్యాంలు పూర్తిగా ధ్వంసమైనట్లు ఈ చిత్రాల్లో తెలుస్తోంది. వరద ధాటికి ధౌళి గంగా ప్రాంతంలో భారీ ఎత్తున శిథిలాలు పోగయ్యాయని చిత్రాలు వివరిస్తున్నాయి. ఈ చిత్రాలను ఇస్రో ప్రభుత్వ అధికారులకు అందించింది.

మరోవైపు, ఉత్తరాఖండ్‌ జల ప్రళయంతో సమీప ప్రాంత ప్రజలకు రాకపోకలు స్తంభించిపోయాయి. తపోవన్‌ వద్ద ఓ బ్రిడ్జి కొట్టుకుపోవడంతో.. అక్కడున్న గ్రామానికి రాకపోకలకు వీల్లేని పరిస్థితేర్పడింది. దీంతో వారి కోసం రోప్‌ వేను ఏర్పాటు చేశారు. హెలికాఫ్టర్ల ద్వారా ఆయా గ్రామాల ప్రజలకు వాటర్‌, ఫుడ్‌ పంపిణీ చేస్తున్నారు. సహాయకచర్యల్లో పురోగతి కనిపిస్తుందని.. గల్లంతైన వారి ఆచూకీ లభిస్తుందని బాధిత కుటుంబసభ్యులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

Read also : భారతీయ వేతన జీవులకు ఒక గుడ్ న్యూస్, ఈ ఏడాది జీతాలు పెరుగుతాయట, అది ఏమేరకు..? అంటే..!