
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. పేరులోనే ఒక పవర్ ఉంది. ఆయన ప్రసంగాలకు ఎంతటి క్రేజ్ ఉందో, ఆయన ధరించే బట్టలకు కూడా అంతర్జాతీయ స్థాయిలో అంతే గుర్తింపు ఉంది. ఖాదీ కుర్తా అయినా, వెస్ట్రన్ సూట్ అయినా.. మోదీ స్టైల్ ఎప్పుడూ ప్రత్యేకం. మరి దేశ ప్రధాని వార్డ్రోబ్ను డిజైన్ చేసే ఆ వ్యక్తులు ఎవరు? మోదీ కుర్తా బ్రాండ్ వెనుక ఉన్న కథేంటి? ఇప్పుడు తెలుసుకుందాం.
నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండి ఆయన దుస్తుల విషయంలో ఒకే బ్రాండ్ను నమ్ముతున్నారు. అహ్మదాబాద్లోని జైడ్ బ్లూ అనే మెన్స్ వేర్ బ్రాండ్ మోదీ ఫ్యాషన్ వెనుక ఉన్న ప్రధాన శక్తి. 1989 నుంచి బిపిన్ చౌహాన్, జితేంద్ర చౌహాన్ అనే ఇద్దరు సోదరులు మోదీ కోసం ప్రత్యేకంగా దుస్తులను డిజైన్ చేస్తున్నారు. నాడు ఆర్ఎస్ఎస్ ప్రచారక్గా ఉన్న సమయంలో మోదీ సుప్రీమో క్లోతింగ్ అనే చిన్న దుకాణానికి వెళ్లేవారు. కాలక్రమేణా ఆ చిన్న దుకాణమే నేడు కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన జైడ్ బ్లూ బ్రాండ్గా అవతరించింది.
సాధారణంగా కుర్తాలు అంటే ఫుల్ హాండ్స్తో ఉంటాయి. కానీ మోదీ సౌకర్యం కోసం హాఫ్ హాండ్స్ కుర్తాలను ఎంచుకున్నారు. ఇదే కాలక్రమేణా మోదీ కుర్తాగా ఫేమస్ అయింది. మోదీ అభిరుచిని గుర్తించిన బిపిన్ చౌహాన్, 2012లో మోదీ కుర్తా, మోదీ జాకెట్ అనే పేర్లను ట్రేడ్మార్క్గా ఉపయోగించుకోవడానికి మోదీ నుంచి అధికారిక అనుమతి పొందారు. బిజీ షెడ్యూల్ వల్ల మోదీ షాపుకు వెళ్లలేకపోయినా, బిపిన్ చౌహాన్ను ఢిల్లీకి పిలిపించి కొలతలు ఇస్తుంటారు. వస్త్రం ఎంపిక నుండి కుట్టు పని వరకు మోదీ స్వయంగా పర్యవేక్షిస్తారని సమాచారం.
కేవలం కుర్తాలే కాదు, విదేశీ పర్యటనల్లో మోదీ ధరించే సూట్లు, వెస్ట్రన్ దుస్తుల వెనుక ముంబైకి చెందిన ప్రముఖ డిజైనర్ ట్రాయ్ కోస్టా పేరు వినిపిస్తుంది. మోదీ బాడీ లాంగ్వేజ్కు తగ్గట్టుగా, ఆధునిక హంగులతో కూడిన సూట్లను డిజైన్ చేయడంలో ఈయన సిద్ధహస్తుడు.
మోదీ ఎక్కువగా ఖాదీ, కాటన్ వస్త్రాలకే ప్రాధాన్యత ఇస్తారు. సందర్భాన్ని బట్టి కాషాయం, తెలుపు, నీలం లేదా మట్టి రంగు దుస్తులను ఆయన ఎంచుకుంటారు. మోదీ స్టైల్ స్ఫూర్తితో జైడ్ బ్లూ బ్రాండ్ విడుదల చేసిన ఉత్పత్తులు ఇప్పుడు మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.