Nellore District: నిద్రలోనే మరణించిన కొడుకు… 3 రోజులుగా శవాన్ని ఇంట్లోనే ఉంచి విలపించిన తల్లి

|

Sep 11, 2021 | 10:17 AM

నిద్రలోనే కుమారుడు మృత్యువాత పడడంతో ఆ తల్లికి ఏం చేయాలో అర్థం కాలేదు. కడుపు కోతతో మూడు రోజులుగా శవాన్ని ఇంట్లోనే ఉంచి విలపించసాగింది.

Nellore District: నిద్రలోనే మరణించిన కొడుకు... 3 రోజులుగా శవాన్ని ఇంట్లోనే ఉంచి విలపించిన తల్లి
Death
Follow us on

తన ప్రాణానికి ప్రాణమైన కొడుకు నిద్రలోనే మరణించాడు. పొద్దన్నే నిద్ర లేపేందుకు ప్రయత్నించగా ఎటువంటి ఉలుకు పలుకూ లేకపోవడంతో.. ఆ తల్లి కుప్పకూలిపోయింది. అక్కడే శవం వద్ద కూర్చుని 3 రోజులగా ఏడుస్తూ ఉంది. దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి చూడగా ఈ షాకింగ్ దృశ్యం కంటపడింది. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. నెల్లూరులో జరిగిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.  నెల్లూరు ఫత్తేఖాన్‌పేట తామరవీధికి చెందిన వెంకటరాజేష్‌ (37)కు రెండేళ్ల క్రితం వివాహామైంది. విభేదాలతో కొన్నాళ్ల క్రితం భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో రాజేష్‌, అతని తల్లి విజయలక్ష్మి తీవ్ర మనోవేధనలో ఉన్నారు. కాస్త లేట్‌గా నిద్ర లేపాలని తల్లికి చెప్పి, ఈ నెల 5వ తేదీ రాత్రి రాజేష్‌ నిద్రపోయాడు.

ఆరో తేదీ సాయంత్రం లేపినా అతడిలో కదలిక లేదు. కుమారుడి మృతిని తట్టుకోలేక ఆమె కుప్పకూలిపోయింది. ఎవరికీ చెప్పకుండా ఇంట్లోనే డెడ్‌బాడీని ఉంచి రోదిస్తోంది. ఇంట్లోంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై సైదులు వచ్చి చూడగా రాజేష్‌ మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించింది. మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి సోదరుడు రమేష్‌ ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేశారు. అనారోగ్యంతో మృతిచెందాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిజంగా ఆ తల్లి పడిన బాధ తలుచుకుంటేనే కన్నీళ్లు వస్తున్నాయి. చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా చూసుకున్న తనయుడు అచేతనంగా ఉండటంతో ఆమె షాక్‌కు గురైందని అర్థమవుతోంది. విధి మనషుల జీవితాలతో ఎలాంటి ఆటలు ఆడుతుందో ఈ ఘటన కళ్లకు కట్టింది.

Also Read: ఎంత కష్టం వచ్చింది తల్లి.. కుమారుడి చితికి తలకొరివి పెట్టిన అమ్మ

ఆంధ్రాకు బిగ్ అలెర్ట్.. 4 రోజుల పాటు భారీ వర్షాలు.. ఆ జిల్లాల ప్రజలకు హెచ్చరిక