జనన, మరణ ధృవీకరణ పత్రాలు జారీచేయడంలో తీవ్ర జాప్యం జరుగుతుండటంపై జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో గత రెండు వారాలుగా సర్టిఫికెట్లు ఇచ్చే ప్రక్రియ ఆగిపోయిందని తెలుసుకున్న జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ జిహెచ్ఎంసి (హెల్త్) బి సంతోష్ తీవ్ర అసహనాన్ని వెలిబుచ్చారు. హుటాహుటీన అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్లను వెంటపెట్టుకుని రంగంలోకి దిగారు. పెండింగ్లో ఉన్న అన్ని దరఖాస్తులను వారంలోపు క్లియర్ చేయకపోతే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పురపాలక సంఘంలోని వివిధ డిపార్ట్ మెంట్లలో పనిచేస్తున్న అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్లు వారంలోపుగా జనన, మరణ ధృవీకరణ పత్రాల ప్రక్రియ వేగవంతం చేయకపోతే, తమ తమ ఉద్యోగాలకు రాజీనామాలు సమర్పించాలని హెచ్చరించారు.
కాగా, సదరు సర్టిఫికేట్ల జారీ ప్రక్రియ ‘మీ సేవా’ కేంద్రాలకి కేటాయించినప్పటి నుండి జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీ ఆలస్యం ప్రారంభమైనట్లు సమాచారం. గతంలో, ప్రజలు తమ దరఖాస్తును “సిటిజన్ సర్వీస్ సెంటర్” లేదా “మీ సేవా” కు సమర్పించే ఎంపిక ఉండేది. కానీ ఈ ధృవపత్రాలను “మీ సేవా” ద్వారా మాత్రమే జారీ చేయాలని తరువాత నిర్ణయించారు. మరోవైపు, జీహెచ్ఎంసీ అధికారులు, “మీ సేవా” సిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడం కారణంగా ప్రజలను అసౌకర్యానికి గురిచేస్తున్నట్లు చెబుతున్నారు.
Read also : దబిడి దిబిడైన సర్కారు లెక్క, అంచనాలకు సిండికేట్ అడ్డం, హైదరాబాద్లో లాటరీ ద్వారా 55 కొత్త బార్లు కేటాయింపు