Antima Yatra Akhri Safar :కొవిడ్ -19 సంక్షోభం మధ్య పేదవారి చివరి కర్మలు గౌరవంగా జరగడానికి కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఒక్క రూపాయికే అంత్యక్రియల సేవలను ప్రారంభించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ (కెఎంసి) ‘అంతిమ యాత్ర.. ఆఖరి సఫర్’ పేరుతో పేదలకు సేవలందిస్తుంది. ఈ పథకం కింద మృతదేహాలను శ్మశానవాటికలో కాల్చడానికి కట్టెలు, కిరోసిన్, అవసరమైన ఇతర వస్తువులను అందిస్తారు.
ఇతర మతాలకు చెందిన పేద ప్రజల కోసం, అవసరమైన సామగ్రిని ఏర్పాటు చేయడంతో పాటు, మృత అవశేషాలను ఖననం చేయడానికి కార్పొరేషన్ స్థలాన్ని కేటాయించింది. జూన్ 2019 లో ప్రారంభించిన‘అంతిమ యాత్ర.. ఆఖరి సఫర్’ పేదలకు ఎంతో సహాయపడుతుందని నిరూపించబడింది. గతంలో ఇదే కార్యక్రమాలకు కొంతమంది వ్యక్తులు, ప్రైవేట్ ఆస్పత్రులు డబ్బులు భారీగా వసూలు చేసేవారు.
అన్ని ఆచారాలు మరియు కోవిడ్ -19 ప్రోటోకాల్కు అనుగుణంగా కరీంనగర్ శివార్లలోని మానేర్ నది ఒడ్డున తుది కర్మలు చేసే కరీంనగర్ మాడిగ సంఘం నుండి కూడా పౌర సంస్థ సహాయం పొందింది. సాధారణంగా, ఒక కోవిడ్ -19 మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడానికి 10,000 రూపాయలు వసూలు చేస్తారు. ప్రైవేటు అంత్యక్రియల బృందాలు దుఖిస్తున్న కుటుంబాల నుంచి భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తాయని కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ సునీల్ రాయ్ తెలిపారు. గత సంవత్సరం కోవిడ్ -19 రోగుల 150 అంత్యక్రియలు జరిగాయి. ఈ సంవత్సరం ఇప్పటివరకు 100 మంది అంత్యక్రియలు జరిగాయని కెఎంసి మేయర్ ప్రకటించారు.
నగరపాలక సంస్థ పరిధిలో ఏవరైనా చనిపోతే వారి గురించి బల్దియాకు సమాచారం అందించి రూపాయి చెల్లిస్తే ప్రత్యేక సిబ్బంది వారి ఇంటికి వెళ్లి దహన సంస్కారాలకు అన్ని ఏర్పాట్లు చేస్తారు. అంతిమయాత్రకు వాహనం, బాడీ ఫ్రీజర్, చితికి ఉచితంగా కట్టెలు, కిరోసిన్ అందజేస్తారు. ఖననం చేస్తే గుంతను తవ్విస్తారు. అలాగే అంత్యక్రియల రోజున 50 మందికి రూ.5కే భోజన సదుపాయం కల్పిస్తారు.