
సముద్రంలో షార్క్ కనిపిస్తే చాలామంది భయంతో దూరంగా వెళ్లిపోతారు. కానీ క్రిస్టినా జెనాటో మాత్రం వాటితో స్నేహం చేసింది. ఇటలీలో జన్మించిన ఆమె చిన్నప్పటి నుంచే షార్క్లంటే ప్రత్యేకమైన ఆసక్తి పెంచుకుంది. పెద్దయ్యాక బహామాస్ సముద్రాల్లో డైవర్గా మారి, షార్క్ల ప్రవర్తనను అధ్యయనం చేయడంతో పాటు వాటి సంరక్షణ కోసం తన జీవితాన్ని అంకితం చేసింది.
క్రిస్టినా చేస్తున్న పనుల్లో అత్యంత ప్రత్యేకమైనది చేపల వేటకు ఉపయోగించే హుక్స్ను షార్క్ల నోటిలో నుంచి తొలగించడం. డైవింగ్ సమయంలో కొన్ని షార్క్ల నోట్లో ఫిషింగ్ హుక్స్ ఇరుక్కున్నట్లు ఆమె గుర్తించింది. వాటి దగ్గరకు వెళ్లి ప్రశాంతంగా ఉండేలా చేసి, జాగ్రత్తగా హుక్స్ను బయటకు తీసేది. 23 ఏళ్ల డైవింగ్ అనుభవంలో 300కు పైగా హుక్స్ను షార్క్ల నోటి నుంచి తొలగించింది.
క్రిస్టినా, షార్క్ల మధ్య ఏర్పడిన అనుబంధం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తోంది. ఆమె మాటల్లోనే చెప్పాలంటే, ఈ బంధం ఒక్కరోజులో ఏర్పడలేదు. ప్రతిరోజూ వాటిని గమనించడం, వాటి ప్రవర్తనను అర్థం చేసుకోవడం, ఓపికగా ఉండటం ద్వారా క్రమంగా నమ్మకం ఏర్పడింది. కొన్ని షార్క్లు ఆమెకు దగ్గరగా వచ్చి ప్రశాంతంగా ఉండటమే కాకుండా, ఆమె ఒడిలో తల పెట్టుకుని ఉండే దృశ్యాలు కూడా కనిపించాయి. అయితే ఇది అన్ని షార్క్లతో చేయగలిగే పని కాదని క్రిస్టినా స్పష్టం చేస్తుంది. ప్రతి షార్క్ ప్రవర్తన భిన్నంగా ఉంటుందని, వాటి దగ్గరకు వెళ్లడం ప్రత్యేక శిక్షణ, అనుభవం అవసరమని ఆమె చెబుతుంది.
క్రిస్టినా కేవలం గాయపడిన షార్క్లకు చికిత్స చేయడమే కాకుండా, సముద్ర జీవుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. పీపుల్ ఆఫ్ ది వాటర్ సంస్థ ద్వారా సముద్ర సంరక్షణ, విద్య, షార్క్ల రక్షణకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఆమె లక్ష్యం షార్క్లను భయంకరమైన జీవులుగా కాకుండా సముద్ర పర్యావరణ వ్యవస్థలో కీలకమైన జంతువులుగా ప్రజలు అర్థం చేసుకునేలా చేయడం. క్రిస్టినా కథలో ప్రత్యేకత ఏమిటంటే.. ఒకప్పుడు మనుషులు భయపడే షార్క్లే ఇప్పుడు ఆమెను నమ్మి దగ్గరకు వస్తున్నాయి. భయం స్థానంలో అవగాహన, హింస స్థానంలో సంరక్షణ ఉంటే మనిషి–వన్యప్రాణుల మధ్య కూడా అద్భుతమైన బంధం ఏర్పడుతుందని ఆమె ప్రయాణం చాటుతోంది.