
భారతదేశంలో సిజేరియన్ (సి-సెక్షన్) ప్రసవాల సంఖ్య ఏటా ఊహించని విధంగా పెరుగుతోంది. వైద్యపరంగా అత్యవసర పరిస్థితుల్లో తల్లీ, బిడ్డల ప్రాణాలను రక్షించడానికి చేసే ఈ శస్త్రచికిత్స.. ప్రస్తుతం దేశంలో ఒక సాధారణ ప్రక్రియగా మారిపోతోందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచనల ప్రకారం ఒక ప్రాంతంలో సి-సెక్షన్ ప్రసవాల రేటు 10 నుండి 15 శాతం లోపు మాత్రమే ఉండాలి. కానీ, భారతదేశంలో ఈ సంఖ్య సగటున 27.2 శాతానికి చేరుకుంది.
ఈ నివేదిక ప్రకారం, దేశంలోనే అత్యధికంగా సి-సెక్షన్ ప్రసవాలు జరుగుతున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. తెలంగాణలో దాదాపు 62.2 శాతం ప్రసవాలు శస్త్రచికిత్సల ద్వారానే జరుగుతున్నాయి. అంటే రాష్ట్రంలో పుడుతున్న ప్రతి 10 మంది పిల్లలలో ఆరుగురు సి-సెక్షన్ ద్వారానే జన్మిస్తున్నారు. దీని తర్వాత పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ 52.2 శాతంతో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. దీనికి విరుద్ధంగా నాగాలాండ్ వంటి ఈశాన్య రాష్ట్రాలలో అత్యల్పంగా 13.2 శాతం సి-సెక్షన్ రేటు నమోదైంది.
ప్రభుత్వ ఆసుపత్రులతో పోలిస్తే ప్రైవేట్ హెల్త్కేర్ సెంటర్లలో సి-సెక్షన్ల రేటు అత్యంత ఆందోళనకరంగా ఉంది. తెలంగాణలోని ప్రైవేట్ ఆసుపత్రులలో జరుగుతున్న ప్రసవాలలో ఏకంగా 83.9 శాతం సిజేరియన్లే కావడం గమనార్హం. జాతీయస్థాయిలో ప్రైవేట్ ఆసుపత్రుల సగటు 54.1 శాతంగా ఉంది. అదే సమయంలో తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రులలో కూడా సి-సెక్షన్ రేటు 48.1 శాతంగా నమోదైంది. ఇది జాతీయ ప్రభుత్వ ఆసుపత్రుల సగటు (16.9శాతం) కంటే మూడు రెట్లు ఎక్కువ.
నొప్పి భరించలేకపోవడం, నిర్దిష్టమైన ముహూర్తాల కోసం ప్రసవాలు ప్లాన్ చేసుకోవడం, గర్భధారణ వయసు పెరగడం (Overweight and Age factors), ఆసుపత్రుల వాణిజ్య ధోరణులు సి-సెక్షన్లు పెరగడానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. అయితే, వైద్యపరమైన అవసరం లేకుండా సిజేరియన్లు చేసుకోవడం వల్ల తల్లులలో ఇన్ఫెక్షన్లు, అధిక రక్తస్రావం వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, అలాగే శిశువులలో రోగనిరోధక శక్తి తగ్గే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిపై జాతీయ స్థాయిలో కఠినమైన నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..