Pocso Court: 23 రోజుల్లోనే సంచలన తీర్పు వెలువరించిన ఘజియాబాద్ పోక్సో కోర్టు.. నిందితుడికి మరణ శిక్ష
Pocso Court: ప్రోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఓ కేసులో కేవలం 23 రోజుల్లోనే నిందితుడికి మరణ శిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడం సంచలనంగా మారింది. ఇంత స్వల్ప ...
ప్రోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఓ కేసులో కేవలం 23 రోజుల్లోనే నిందితుడికి మరణ శిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడం సంచలనంగా మారింది. ఇంత స్వల్ప వ్యవధిలోనే న్యాయస్థానం తీర్పు వెల్లడించడం దేశంలోనే తొలిసారి. అయితే దేశంలో జరుగుతున్న నేరాల విషయాల్లో నిందితులకు శిక్ష పడాలంటే చాలా సమయం పడుతుంది. పూర్తి స్థాయిలో పోలీసుల దర్యాప్తు , ఆ తర్వాత నివేదికను కోర్టుకు సమర్పించడం, తర్వాత కోర్టు విచారణ చేపట్టడం, తీర్పు రావడం అనేది ఆలస్యంగా జరిగే ప్రాసెస్. అలాంటిది అతి తక్కువ సమయంలోనే తీర్పు రావడం రికార్డేనని చెప్పాలి. రెండేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో ఘజియాబాద్ ప్రత్యేక పోక్సో కోర్టు నిందితుడికి మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. విచారణ అనంతరం కేవలం 23 రోజుల్లోగా తీర్పునిస్తూ రికార్డు సృష్టించింది.
వివరాల్లోకి వెళితే.. అక్టోబర్ 19న ఘజియాబాద్ కవినగర్ ప్రాంతానికి చెందిన రెండున్నరేళ్ల చిన్నారి అత్యాచారం, హత్యకు గురైంది. రోడ్డు పక్కనే ఉన్న చెట్ల పొదల్లో బాలిక మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ కేసులో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే చిన్నారి తండ్రి సన్నిహితుడైన చందన్ అనే వ్యక్తే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఈ మేరకు డిసెంబర్ 29నే చార్జిషీట్ దాఖలు చేసినట్లు డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ అవినాష్ కుమార్ తెలిపారు. తీర్పు వెలువరించే రోజు సైతం పదిమంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. సాక్షాధారాలను పరిశీలించిన అనంతరం నిందితుడికి మరణ శిక్ష విధిస్తూ న్యాయమూర్తి మహేంద్ర శ్రీ వాస్తవ తీర్పు ఇచ్చారు.
అయితే రికార్డు సమయంలోనే నిందితుడికి మరణశిక్ష విధిస్తూ తీర్పు రావడం ఓ సంచలనమని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉత్కర్ష్ వాట్స్ వ్యాఖ్యానించారు.