
దర్శకుడు వీ.ఎన్.ఆదిత్య తన కెరీర్లో అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచిన ‘నేనున్నాను’ సినిమా నిర్మాణానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన, అంతగా తెలియని విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా నాగార్జున గారు సినిమా ఫస్ట్ హాఫ్ చూసి ‘డిసప్పాయింట్’ అయ్యారనే అపోహలను ఆయన ఈ సందర్భంగా తొలగించారు. వీ.ఎన్.ఆదిత్య మాట్లాడుతూ.. నాగార్జున గారు ఎడిటింగ్ రూమ్లో ‘నేనున్నాను’ తొలి సగభాగాన్ని చూసి అసంతృప్తి చెందారనేది కేవలం ఒక రూమర్ మాత్రమే. నిజానికి, అప్పట్లో ఎడిటింగ్ జరుగుతున్నప్పుడు, ‘ఏ శ్వాసలో’ పాటలో వాడటానికి కొన్ని క్లాసికల్ కీర్తనల పల్లవులను తాత్కాలికంగా పెట్టారట. అన్నపూర్ణ స్టూడియోస్ లో డబ్బింగ్ థియేటర్ బయట నుంచున్న నాగార్జున గారు, ప్రతిసారీ ఈ క్లాసికల్ పాటలే వినబడుతుండటంతో, “ఏంటోయ్ అండి, మనం ఏదో అల్లరి అల్లుడు లాంటి సినిమా అనుకుంటే శంకరాభరణం చేస్తున్నాడేంటి మీ డైరెక్టర్?” అని సరదాగా అడిగారట. ఇది కేవలం ఒక జోక్ మాత్రమే తప్ప, ఆయన నిరాశ చెందలేదని ఆదిత్య స్పష్టం చేశారు.
‘నేనున్నాను’ చిత్రానికి ప్రాణమైన ‘ఏ శ్వాసలో పాట రూపకల్పనలో వీ.ఎన్.ఆదిత్య వ్యక్తిగతంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. తాను ఈ ఒక్క పాటకైనా డాన్స్ మాస్టర్ను లేకుండా తీస్తానని పట్టుబడ్డానని, నాగార్జున గారు డాన్స్ మాస్టర్ను పెట్టుకోవాలని ఒత్తిడి చేసినా, తాను తన నిర్ణయం మార్చుకోలేదని తెలిపారు. ఈ పాటను చూసిన నాగార్జున గారి బంధువు ఓ అబ్బాయి కన్నీళ్లు పెట్టుకుని, రాఘవేంద్రరావు గారు తీసినట్టుగా ఉందని ప్రశంసించారట. అది తనకెంతో ధైర్యాన్ని ఇచ్చిందని ఆదిత్య గుర్తుచేసుకున్నారు.
సినిమా విడుదలైనప్పుడు ఎదురైన ప్రతికూల పరిస్థితులను వీ.ఎన్.ఆదిత్య వివరించారు. ‘నేనున్నాను’ తొలి రోజుల్లో విజయవాడ, హైదరాబాద్ వంటి చోట్ల ‘అట్టర్ ఫ్లాప్’, ‘పరమ చెత్త సినిమా’ అనే డిజాస్టర్ టాక్ అందుకుందట. ఆ సమయంలో నాగార్జున గారు మారిషస్ లేదా మలేషియాలో కుటుంబంతో విహారయాత్రలో ఉన్నారట. డిప్రెషన్లో ఉన్న వీ.ఎన్.ఆదిత్యకు నాగార్జున గారు ఫోన్ చేసి “నువ్వేమీ కంగారు పడకు. రెండు మూడు వారాల తర్వాత ఇది 100 రోజుల సినిమా అవుతుంది. ట్రస్ట్ మీ. ‘ఏ శ్వాసలో’ పాట ఈ సినిమాకి ఆయువుపట్టు” అని భరోసా ఇచ్చారట. నాగార్జున గారి మాట నిజమై, సినిమా అద్భుత విజయం సాధించడం విశేషం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.