
దర్శకుడు వి.ఎన్. ఆదిత్య తన సినీ ప్రయాణంలోని లోతైన అంశాలను, వ్యక్తిగత ఆలోచనలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ముఖ్యంగా, తన దర్శకత్వంలో వచ్చిన మనసు మాట వినదు చిత్రంలోని ఒక సీక్వెన్స్, దర్శకుడు ఏఆర్ మురుగదాస్ రూపొందించిన స్టాలిన్ సినిమాలో కనిపించిన ఒక సన్నివేశానికి ప్రేరణగా నిలిచిందని ఆయన వెల్లడించారు. మనసు మాట వినదు చిత్రంలో నటించిన నాగబాబు గారు ఈ విషయాన్ని తనను అడిగి ధృవీకరించారని, అయితే స్టాలిన్ చూసిన తర్వాత కూడా తాను రూపొందించిన సీక్వెన్స్ మరింత ఉన్నతంగా ఉందని భావించానని ఆదిత్య పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన దర్శకుడు మురుగదాస్కు రాక కాదని, కానీ ఐడియా వెనుక ఉన్న ఒరిజినాలిటీ, సోల్ తన చిత్రంలో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
నిర్మాతగా తన వైఫల్యానికి గల కారణాలను వి.ఎన్. ఆదిత్య స్పష్టంగా వివరించారు. బేరం చేయలేకపోవడమే తన ప్రధాన బలహీనత అని, ముఖ్యంగా ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో చర్చలు జరపలేనని చెప్పారు. ఎంత ఇస్తే అంత ఇచ్చేవారినని తెలిపారు. ప్రచారానికి, మార్కెటింగ్ కు తాను పూర్తిగా దూరమని, ఇది తనకు అస్సలు ఇష్టం లేని అంశమని వివరించారు. “షోబిజ్” లో “షో ఆఫ్” అవసరమని అంగీకరించినప్పటికీ, తాను లో-కీ మెయింటైన్ చేయడానికే ఇష్టపడతానని పేర్కొన్నారు. ఇది తన స్వంత నిర్ణయమని, ఇండస్ట్రీ తప్పు కాదని ఆయన స్పష్టం చేశారు.
హారర్ జానర్స్ గురించి మాట్లాడుతూ.. దెయ్యాలు, రక్తపాతం, బ్లాక్ మ్యాజిక్ వంటి అంశాలతో కూడిన చిత్రాలను తాను రూపొందించడానికి ఇష్టపడనని, హారర్ చిత్రాలు చూడటానికి కూడా భయపడతానని చెప్పారు. డబ్బులిచ్చి భయాన్ని కొనుక్కోవడం ఎంటర్టైన్మెంట్ కాదని ఆయన అన్నారు. అయితే, కామెడీ హారర్ చిత్రాలు మాత్రం తెలుగు ప్రేక్షకుల కోసం ధైర్యంగా చూస్తున్నానని తెలిపారు. తన సినిమాలో “తీయనీ కలలను” పాటను బొంబాయి జయశ్రీ పాడినందుకు చాలా సంతోషంగా ఉన్నానని, ఈ పాట తనకు ఎంతో ప్రత్యేకమని, జయశ్రీ గారికి పద్మ పురస్కారం వచ్చినప్పుడు ఒక జాతీయ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో ఈ పాట గురించి ఆమె ప్రస్తావించడం తనను ఎంతగానో ఆనందపరిచిందని వివరించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.