
తెలుగు సినీ దర్శకుడు గుణశేఖర్ తన జీవితంలో ఒక ముఖ్యమైన చిత్రంగా నిలిచిన రుద్రమదేవి నిర్మాణం వెనుక ఉన్న అనేక విశేషాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. హీరోయిన్ అనుష్క శెట్టి అసాధారణ అంకితభావం, అల్లు అర్జున్ అందించిన సహకారం, అలాగే ప్రాజెక్టు సమయంలో తాను ఎదుర్కొన్న సవాళ్లను ఆయన పంచుకున్నారు. గుణశేఖర్ మాట్లాడుతూ, రుద్రమదేవి ప్రమోషన్ల సమయంలో అనుష్క శెట్టి రోజుకు దాదాపు 10-15 ఇంటర్వ్యూలలో పాల్గొనేవారని, ఎంత కష్టమైన ప్రయాణాలైనా అలసట లేకుండా పూర్తి చేసేవారని తెలిపారు. ప్రస్తుతం చాలామంది నటీనటులు రెండు ఇంటర్వ్యూలకే అలసిపోతున్నారని, కానీ అనుష్క ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేవారని, ఆమెను చూసి తమకు ఎనర్జీ వచ్చేదని గుర్తు చేసుకున్నారు.
సినిమా చిత్రీకరణలో అనుష్క అద్భుతమైన కృషి చేశారని, గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం, ఏనుగుపై కూర్చుని సన్నివేశాలు వంటివి ఎంతో కష్టపడి నేర్చుకున్నారని గుణశేఖర్ వివరించారు. కత్తి తిప్పడం వల్ల ఆమె ఎముకకు సమస్య కూడా వచ్చిందని, రాజసంగా కనిపించే ఏనుగు స్వారీ వెనుక ఎంతో వెన్నునొప్పి ఉంటుందని, ఈ క్యారెక్టర్ను చేయడం అత్యంత కష్టమైన పని అని తెలిపారు. ఏ ఇతర హీరోయిన్ అయినా సగం లోనే “నా వల్ల కాదు, డూప్తో తీయండి” అని చెప్పేవారని, కానీ అనుష్క పూర్తి అంకితభావంతో చేశారని ఆయన ప్రశంసించారు.
రుద్రమదేవి ప్రాజెక్టును తాను భుజానికెత్తుకున్నప్పుడు “గుణశేఖర్ అయిపోయాడు”, “పిచ్చి పట్టింది” వంటి వ్యాఖ్యలు ఇండస్ట్రీలో వినిపించాయని గుణశేఖర్ గుర్తు చేసుకున్నారు. అయితే రుద్రమదేవి చరిత్రపై తనకున్న నమ్మకంతోనే ఈ సవాళ్లను ఎదుర్కొన్నానని అన్నారు. నిర్మాతగా తనకు టేబుల్ ప్రాఫిట్ మిగలకపోయినా, ఈ సినిమా నో లాస్, నో ప్రాఫిట్ బ్రేక్ ఈవెన్తో విడుదలైందని, అది తాను సాధించిన విజయంగా భావిస్తానని తెలిపారు. తన విజన్పై నమ్మకంతోనే తాను అనుకున్న ఫలితాన్ని సాధించానని పేర్కొన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.