
సినిమా ఇండస్ట్రీలో నటుడిగా దూసుకుపోతున్నారు రాజీవ్ కనకాల.. కెరీర్ బిగినింగ్ లో విలన్ పాత్రలు చేసిన ఆయన.. ఆతర్వాత హీరో చేసి ఇప్పుడు సహాయక పాత్రలతో మెప్పిస్తున్నారు. సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నారు రాజీవ్.. రాజీవ్ చాలా సినిమాల్లో రకరకాల పాత్రలు చేసి అలరిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినీ రంగంలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు రాజీవ్. అలాగే జూనియర్ ఎన్టీఆర్తో తన అనుబంధం తొలి రోజుల నుంచి కొనసాగుతోందని, జనతా గ్యారేజ్, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాల్లో కూడా కలిసి పనిచేశామని రాజీవ్ అన్నారు. ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్ పాత్రను పరిచయం చేసే క్యారెక్టర్ తనదేనని ఆయన గుర్తు చేసుకున్నారు.
తారక్ తో పాటు సినిమా ఇండస్ట్రీలో తరుణ్, మనోజ్, శివ బాలాజీలు తనకు మంచి స్నేహితులని రాజీవ్ తెలిపారు. ముఖ్యంగా తరుణ్ అద్భుతమైన నటుడని, సరైన అవకాశం వస్తే తిరిగి ఫామ్ లోకి వస్తాడని, ప్రత్యేకించి ఓటీటీ వేదికల ద్వారా మళ్లీ తన ప్రతిభను చాటుకోగలడని రాజీవ్ అన్నారు. అదేవిధంగా, శివ బాలాజీ వంటి నటులు కూడా ప్రస్తుతం అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకుంటున్నాడు. శ్రీరామ్ కూడా ఇప్పుడు సైడ్ క్యారెక్టర్స్ కాకుండా ఇండివిడ్యువల్ ప్రాజెక్ట్స్కు ప్రాధాన్యత ఇస్తున్నాడని, దీనికి ఓటీటీనే కారణమని రాజీవ్ తెలిపారు. వీటితో పాటు రాజీవ్ కనకాల తన తండ్రి, ప్రముఖ నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాల సినీ ప్రస్థానం గురించి తెలిపారు. దేవదాస్ కనకాల చెన్నైకి వచ్చి అవకాశాలు సులువుగా లభిస్తాయని భావించినప్పటికీ, అప్పటి పరిశ్రమలో ఉన్న లాబీయింగ్ కారణంగా ఆయనను ఎవరూ పట్టించుకోలేదని పేర్కొన్నారు.
బుద్ధిమంతుడు చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు పక్కన స్నేహితుడి పాత్రలో, అలాగే కె. విశ్వనాథ్ గారి దర్శకత్వంలో కాలం మారింది చిత్రంలో ఒక నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నప్పటికీ, ఆ తర్వాత అవకాశాలు రాలేదని చెప్పారు. జీవనోపాధి కోసం దేవదాస్ కనకాల హైదరాబాద్లోని కేంద్ర ప్రభుత్వ సాంగ్ అండ్ డ్రామా డివిజన్లో ఉద్యోగంలో చేరారు. అక్కడే రాజీవ్ తల్లిని చూసి, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే, ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి, చిత్ర పరిశ్రమకు సేవ చేయాలనే తపనతో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్థాపించిన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో అధ్యాపకుడిగా చేరారని రాజీవ్ వెల్లడించారు. పది మందిని కళాకారులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఆ తర్వాత మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో పని చేసి, చివరికి 1985 నుంచి తమ సొంత ఇన్స్టిట్యూట్ను స్థాపించి, ఎన్నో కష్టాలు, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని రాజీవ్ గుర్తు చేసుకున్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.