
అయితే ఈ ఏడాది పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా.. వచ్చే ఏడాది మాత్రం బాక్సాఫీస్ వద్ద ఒక పెను తుపాను రాబోతోంది. తెలుగు సినిమా చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా నలుగురు భారీ పాన్ ఇండియా స్టార్లు దండయాత్రకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఇద్దరు అగ్ర హీరోలు తమ కెరీర్లోనే అత్యంత భారీ చిత్రాలతో సమ్మర్ హీటును రెట్టింపు చేయబోతున్నారు. ప్రపంచ సినిమా కళ్లు మన టాలీవుడ్ వైపు తిరిగేలా చేస్తున్న ఆ భారీ ప్రాజెక్టులు ఏంటి? బాక్సాఫీస్ లెక్కలను మార్చేందుకు సిద్దమవుతున్న సినిమాలేంటో చూద్దాం..
వచ్చే ఏడాది సమ్మర్ను టార్గెట్ చేసిన మొదటి భారీ సినిమా ‘స్పిరిట్’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ‘యానిమల్’ వంటి భారీ విజయం తర్వాత సందీప్ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ సమ్మర్ స్పెషల్గా మార్చి 5న విడుదల కాబోతోంది. ఇందులో తృప్తి డిమ్రీ హీరోయిన్గా నటిస్తుండగా, మెగాస్టార్ చిరంజీవి, విజయ్ దేవరకొండ అతిథి పాత్రల్లో కనిపిస్తారనే వార్తలు నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే.. బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ ఊచకోత మామూలుగా ఉండదు.
ప్రభాస్ సినిమా వచ్చిన సరిగ్గా నెల రోజులకు బాక్సాఫీస్ రంగంలోకి సూపర్ స్టార్ మహేష్ బాబు దిగబోతున్నారు. జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ సమ్మర్ మొత్తాన్ని పిండేయడానికి సిద్ధమైంది. గ్లోబల్ ట్రాటర్ అడ్వెంచర్ డ్రామాగా వస్తున్న ఈ భారీ ఫాంటసీ యాక్షన్ మూవీ ఏప్రిల్ 7న విడుదల కాబోతున్నట్లు శుక్రవారమే అధికారికంగా ప్రకటించారు. వరుసగా హాలీడేస్ ఉండేలా ప్లాన్ చేసుకున్న రాజమౌళి, ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టించాలని స్కెచ్ వేశారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Varanasi And Spirit Posters
ఈ ఇద్దరు స్టార్లతో పాటు మరికొంతమంది హీరోలు కూడా ఈ ఏడాది సమ్మర్ పై కన్నేశారు. రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’, నేచురల్ స్టార్ నాని ‘ది ప్యారడైజ్’, అలాగే పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే వీటి విడుదలపై ఇంకా పూర్తిస్థాయి స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ ఈ సినిమాలు కూడా లైన్ లోకి వస్తే.. వచ్చే ఏడాది సమ్మర్ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల పండగ జరగడం ఖాయం.
బాక్సాఫీస్ లెక్కలు కనీసం రెండు వేల కోట్ల నుంచి ప్రారంభం అవుతాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రభాస్ ‘స్పిరిట్’, మహేష్ బాబు ‘వారణాసి’.. ఈ రెండు సినిమాలు కేవలం తెలుగు ప్రేక్షకులనే కాదు, యావత్ భారతీయ సినీ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగా మార్క్ యాక్షన్, రాజమౌళి మార్క్ విజువల్ వండర్ ఒకే సీజన్లో రావడం ప్రేక్షకులకు కనువిందే.